విజయపురిసౌత్: అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం నాగార్జునసాగర్ వద్ద రవాణా శాఖ, పోలీస్, ఫైర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రంకన్న్ డ్రైవ్, ఫిట్నెస్, ఇన్సురెన్స్, పర్మిట్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తావని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాష, ఎంవీఐ శేషారెడ్డి, విజయపురి సౌత్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్ కమిటీ చైర్మన్ విశాల్ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు. రీసెర్చ్ ద్వారా నూతన దృక్కోణాలు వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని సాంబశివరావు తెలిపారు. తన నియామాకానికి కృషి చేసిన చైర్మన్, ఇతర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
చీరాల: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చీరాల మండలం వాడరేవులో చోటుచేసుకుంది. ఈపూరుపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల మండలం వాడరేవుకు చెందిన కె.పోతురాజు (45) అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఎటువంటి లాభం ఉండదని చెప్పారు. అంతేగాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్లతో సమయం వృధా చేసుకోవద్దని, యువత ఉన్నత స్థాయికి చేరేందుకు తమ సమయం ఉపయోగించాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని అన్నారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం దృష్ట్యా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బులు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురై, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.


