నరసరావుపేట ఈస్ట్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణానికి పట్టణంలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు పట్టణంలోని పలు కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి శుక్రవారం రాములోరి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టాభిరామస్వామి ఆలయం, సతైనపల్లిరోడ్డులోని సీతారామచంద్ర స్వామి ఆలయం, క్లాత్మార్కెట్ సెంటర్లోని సీతారామస్వామి ఆలయం, పాలపాడురోడ్డులోని చిన్నసింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, బరంపేటలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంతో పాటు వైష్ణవాలయాలలో సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సతైనపల్లిరోడ్డులోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త వేముల శంకరనారాయణ, నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో 108 దంపతులచే సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం సీతారామ కళ్యాణ గానామృతం, సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అలాగే పట్టాభిరామస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయగుప్త, అనూరాధ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహిం చనున్నారు.


