వీరారాధన ఉత్సవాలకు అంకురార్పణ
కారెంపూడి: పల్నాటి రణ క్షేత్రంలో పల్నాటి వీరుల ఆయుధాలు బుధవారం రాత్రి కొలువుదీరాయి. బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహ కుంతం ఉత్సవానికి కదలి వచ్చి వీరుల గుడిలో కొలువు దీరింది. గుడి ముఖ మండపంలో ఉన్న పోతురాజుకు పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ పడిగెం కట్టించారు. అనంతరం 101 నూలు పోగులతో పోతురాజుకు వీరుల గుడి పూజారులు ఆనకట్టు కట్టారు. పల్నాటి రణం ముగిసే వరకు రణ క్షేత్రాన్ని వీడి వెళ్లవద్దని బ్రహ్మనాయుడు పోతురాజుకు ఆన పెట్టినట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తిక పౌర్ణమి ఘడియల్లో ఈ క్రతువును పూర్తి చేశారు. ఉదయం వీరుల గుడిలో ఉన్న ఐదు ఆయుధాలను వెలుపలికి తీసి పూజించారు. చెన్నకేశవుని సన్నిధిలో ఉన్న బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహ కుంతాన్ని వీరుల గుడికి తరలించి నాగులేరు గంగధారి మడుగులో శుభ్రపరచి పూజ చేశారు. తర్వాత ఆచారం ప్రకారం వస్తున్న నాలుగు ఆయుధాలకు పూజ చేశారు. రాత్రికి ఆయుధాలను సంప్రదాయ డోలు సన్నాయి మేళాల మధ్య గ్రామోత్సవంగా ఆచారవంతులు బయలు దేరారు.
చెన్నకేశవ స్వామికి పూజలు
మొదట చెన్నకేశవస్వామిని ఆచారవంతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి, ధూపం వేశారు. అనంతరం సూరేశ్వర స్వామి అంకాలమ్మ ఆలయ ప్రాంగణ ముఖ ద్వారానికి ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం నుంచి బ్రహ్మనాయుడు ఆయుధం, వీరుల ఆయుధా లు ప్రవేశం చేశాయి. అప్పటి వరకు ఉపవాస దీక్షలు చేపట్టి అంకాలమ్మ తల్లి దర్శనం కోసం వేచిఉన్న భభక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత వీరుల ఆయుధాలు తర్వాత బాలచంద్రుని పొట్టేలు పాద ముద్రలు ఉన్న చోటు మీదగా కోట బురుజు మార్గం ద్వారా వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికి చేరాయి. పీఠాధిపతిని తోడ్కొని అంతా వీరుల గుడికి చేరుకున్నారు. అక్కడ నృసింహకుంతం సమక్షంలో పోతురాజు శిలకు పడిగెం కట్టారు. మిగిలిన అన్ని ఆయుధాలు వీరుల గుడిలో కొలువుదీరాయి. చెన్నకేశవుని పల్నాటి వీరాచార పీఠాన్ని వీరుల ఆయుధాల ముందు ఉంచి అఖండజ్యోతిని వెలిగించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల ఉత్సవాలు పూర్తయ్యే వరకు వెలుగుతుంది.
దీప కాంతులతో వీరుల గుడి
వీరుల గుడి నిధి పూజారులు, పిన్నలు, పెద్దలు వీరుల గుడి ఆవరణలో కార్తిక దీపాలను వెలిగించారు. దీప కాంతులతో వీరుల గుడి కాంతులీనింది. పీఠాధిపతి సమక్షంలో పడిగెం కార్యక్రమం పూర్తికాగానే తర్వాత వీరుల గుడికి తూర్పున ఉన్న ముఖ మండపంలో రాత్రి పొద్దు పోయిన తర్వాత క్రతువు నిర్వహించారు. వీరుల ఆత్మలు రణక్షేత్రానికి తరలివస్తాయనే నమ్మికతో కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహ కుంతం పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతంలో ఉన్న వీరుల గుడిలో కొలువుదీరింది. దీంతో పల్నాటి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
గ్రామోత్సవం అనంతరం వీరుల గుడిలో
కొలువుదీరిన ఆయుధాలు
పోతురాజుకు పడిగెం కార్యక్రమాన్ని
పర్యవేక్షిస్తున్న పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ
రణ క్షేత్రానికి కదలివచ్చిన
బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహ కుంతం
పోతురాజుకు పడిగెం
కట్టించిన పీఠాధిపతి
అఖండజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం
వీరారాధన ఉత్సవాలకు అంకురార్పణ


