
నియమాలు పాటిస్తే ప్రతి ఇంట్లో వెలుగులు
పాటించాల్సిన జాగ్రత్తలు...
పండగ జరుపుకునే సందర్భంలో కాటన్న్ దుస్తులు ధరించాలి.
దీపావళి మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ కిచెన్, మూసి ఉన్న గదుల్లో పెట్టరాదు.
పిల్లలు మందులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దవాళ్లు పక్కనే ఉండాలి.
గ్రామాల్లో పూరి గుడిసెలు, గడ్డివాముల దగ్గర మందులు కాల్చకూడదు.
దీపావళి సంతోషంగా ఉండాలంటే ..
అందరి ఇళ్లలో వెలుగులు నింపే పండుగ దీపావళి. పండుగ రోజు సంతోషంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించకుంటే ఆ ఇంటిలో సంతోషం కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.శ్రీధర్ కొన్ని సూచలను చేశారు.
నరసరావుపేటటౌనన్్: జాగ్రత్తలు పాటించి సంతోషమైన దీపావళి జరుపుకోవాలని పల్నాడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్. శ్రీధర్ అన్నారు. రానున్న దీపావళి పండగను పురస్కరించుకొని హోల్సేల్, తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరవుతున్న నేపథ్యంలో వ్యాపారులు, ప్రజలు పాటించాల్సిన భద్రత చర్యలను జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ‘సాక్షి’తో పంచుకున్నారు.
లైసెన్స్ పొందే విధానం..
వ్యాపారి స్టాల్ ఏ ప్రదేశంలో పెడుతున్నారు? అక్కడ ప్రజల నివాసాలు, వ్యాపార సముదాయాలు తదితర విషయాలను సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్డీవో లైసెన్స్ మంజూరు చేస్తారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దుకాణాల ఏర్పాటు కోసం లైసెన్స్లు పొందిన వారు తక్కువ. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పట్టణాలు ఉన్నాయి. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా సుమారు 130 మంది తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం 100 మంది దరఖాస్తు చేశారు. నరసరావుపేట పట్టణంలో గత ఏడాది 40 మంది లైసెన్స్ తీసుకుంటే ఈ ఏడాది 27 మంది మాత్రమే ముందుకొచ్చారు. లైసెనన్స్ పొందిన దుకాణదారులు ఈ నెల 19, 20, 21 తేదీల్లో మాత్రమే మందులు విక్రయించాలి.
షాపుల ఏర్పాటులో నిబంధనలు ఇలా...
స్టాల్స్ ఏర్పాటు చేసేటప్పుడు తగలబడే స్వభావం లేని మెటీరియల్తో దుకాణాలు నిర్మించుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో షాపు ఉండేలా చూసుకోవాలి. షాపుకి, షాపుకి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. పెట్రోల్ బంకుకు 15 మీటర్ల దూరంలో స్టాల్స్ పెట్టుకోవాలి. స్టాల్స్ ఉన్న ప్రదేశంలో పొగతాగటం నిషేధం. ప్రతి షాపు వద్ద రెండు బక్కెట్లలో నీరు, రెండు బక్కెట్లలో ఇసుక ఉంచుకోవాలి.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. దీపావళి పండుగ ప్రతి ఇంటిలోనూ కొత్త వెలుగులు నింపాలంటే కొద్దిపాటి మెలకువలు పాటించాలి. మన అజాగ్రత్త మరొకరికి బాధగా మారకూడదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వెలుగుల పండగను జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ భద్రత నియమాలను పాటిస్తే దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగు నింపుతుందని డీఎఫ్వో వివరించారు.

నియమాలు పాటిస్తే ప్రతి ఇంట్లో వెలుగులు