
గ్రామాల్లో ప్రతి ఇంటినీ సందర్శించండి
పల్నాడు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి
పెదకూరపాడు : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి ఆదేశించారు. ఆయన బుధవారం పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జ్వరంతో బాధపడుతున్న రోగులను పరామర్శించి, ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం 75 తాళ్లూరు పీహెసీలో వైద్య సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. కాలువల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్య సమస్యలున్న ప్రతి ఒక్కరినీ కలవాలని, వారి రక్త నమూనాలు తీసుకోవాలని చెప్పారు. పలు గ్రామాల్లో పర్యటించి, మురుగు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.
నేటి నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 19వరకు వివిధ క్రీడాంశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్కుమార్, మహిళా కార్యదర్శి వి.పద్మావతి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపికలు స్పెల్– 1లో భాగంగా అండర్–14, అండర్–17 బాలురు, బాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోటీల్లో భాగంగా ఈనెల 11న నందిగామ జెడ్పీ హైస్కూలులో సెపక్తక్రా, 12న డీఎస్ఏ స్టేడియంలో కరాటే, 15న చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాలలో జూడో, గట్కా, 16న డీఎస్ఏ స్టేడియంలో ఫుట్బాల్, 17న అచ్చంపేట గురుకుల పాఠశాలలో రగ్బీ, 18న ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ఈత, 19న ఏఎంజీ పాఠశాలలో బాక్సింగ్, అచ్చంపేటలో రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
మాచర్ల: పట్టణ శివారు శ్రీశైలం రోడ్డు గ్యాస్ కంపెనీ వద్ద మంగళవారం రాత్రి తిరుమలకొండ చంద్రశేఖర్ (26) యువకుడిని బండరాయితో మోది దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నించగా, మృతుడి బంధువులు న్యాయం చేయాలని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని, నిందితులను వెంటనే పట్టుకుంటామని సీఐ ప్రభాకరరావు బాధితులకు హామీ ఇచ్చారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
డాక్టర్ దుర్గా భార్గవికి మూడు బంగారు పతకాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వనం దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు దక్కాయి. మంగళవారం విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 28వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బంగారు పతకాలు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండీ పీడియాట్రిక్స్లో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ ధర్మవరపు అమృతవల్లి మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు గోల్డ్ మెడల్, ఎండీ పీడియాట్రిక్స్లో ఉత్తమ అవుట్గోయింగ్ స్టూడెంట్గా గుర్తింపు పొందినందుకు డాక్టర్ కృష్ణారావు పురోహిత్ గోల్డ్ మెడల్, ఎండీ పీడీయాట్రిక్స్ పార్ట్–2 పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఉత్తమ డిజార్టేషన్ సమర్పించినందుకు ఎస్వీరావు అండ్ ఎంఎం స్వామి గోల్డ్ మెడల్ను భార్గవి అందుకున్నారు.

గ్రామాల్లో ప్రతి ఇంటినీ సందర్శించండి