విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాంచీ స్టేషన్కు రూ.1,01,300 ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.
బుద్ధిజం అకాడమీ
ఏర్పాటుకు స్థల పరిశీలన
విజయపురిసౌత్: గ్రామీణ వారసత్వం, అభి వృద్ధి కోసం భారతీయ ట్రస్ట్ సంస్థ ఆదివారం నాగార్జునసాగర్లో బుద్ధిజం అకాడమీ స్థాపించడానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. పర్యాటక శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించారు. స్థల పరిశీలన చేసిన బృందంతోపాటు రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, గురజాల ఆర్డీవో మురళి, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, తహసీల్దార్ కిరణ్, మండల సర్వేయర్, హరిత రిసార్ట్స్ యూనిట్ ఇన్చార్జి మస్తాన్రావు, నాగులవరం గ్రామ సర్వేయర్ అయ్యప్ప పాల్గొన్నారు.
సజావుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఏసీ కళాశాల, టీజేపీఎస్, విజ్ఞాన్ నిరూల డిగ్రీ, పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పరిశీలించారు. ఉదయం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు హాజరు 78.2 శాతం నమోదైంది. మధ్యాహ్నం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసిన 1,492 మంది అభ్యర్థుల్లో 1,133 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,216 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 340, బ్యాంక్ కెనాల్కు 1,930, తూర్పు కాలువకు 720, పశ్చిమ కాలువకు 241, నిజాపట్నం కాలువకు 454, కొమ్మూరు కాలువకు 3,420, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 53,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల 12వ వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,01,300
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,01,300
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,01,300