
ఇదేనా సంక్షేమం?!
● నరసరావుపేటలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ● పది గదుల్లో లేని లైట్లు, ఫ్యాన్లు ● ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ● ఒక్కో బాత్రూమ్ను వినియోగిస్తున్న 30 మంది విద్యార్థులు ● విద్యార్థుల దుర్భర స్థితిపై డాక్టర్ గోపిరెడ్డి ఆవేదన
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని రామిరెడ్డిపేట పాత సమితి కార్యాలయ సెంటర్ సమీపంలోని ప్రభుత్వ సంక్షేమ బాలుర ఎస్సీ హాస్టల్ను పరిశీలించారు. హాస్టల్ రెండు అంతస్తులు తిరిగి చూశారు. వంటశాలను పరిశీలించి విద్యార్థుల కోసం తయారుచేస్తున్న అన్నం, కూరలను పరిశీలించారు. అన్నం తిని రుచిచూశారు.. తాము పడుతున్న బాధలను విద్యార్థులు డాక్టర్ గోపిరెడ్డికి వెల్లడించారు.
● హాస్టల్లో సుమారు 160 మంది విద్యార్థులు ఉంటుండగా వారందరూ రూమ్కు 15 నుంచి 20మంది వరకు ఉండటాన్ని గమనించారు.
● అలాగే సుమారు పదిరూమ్లలో లైట్లు, ఫ్యాన్లు లేకపోవటం, బాత్రూమ్లో లైటు లేకపోవటాన్ని గమనించి వార్డెన్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
● ఎక్కడిచెత్త అక్కడనే కుప్పలుగా పడిఉండటాన్ని గమనించి వార్డెన్ను ప్రశ్నించగా వర్కర్లు లేరని వార్డెన్ సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరపున 24గంటల వ్యవధిలో ఫ్యాన్లు, లైట్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.
అధ్వాన స్థితిలో హాస్టళ్లు
అనంతరం మీడియాతో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్ రావట్లేదన్నారు. విద్యార్థులకు ఫ్యాన్లు, లైట్లు, బెడ్లు లేవని చెప్పారు. ఈ హాస్టల్లో రెండు వారాల నుంచి పది రూములలో లైట్లు లేవని, లైటు లేకుండా ఏవిధంగా చదువుకుంటారని ప్రశ్నించారు. ఒక్కో బాత్రూమ్ 30మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని, దానిలో లైటుకూడా లేదని చెప్పారు. తాగేందుకు మంచినీరు లేకపోవటంతో ఎదురుగా ఉన్న ఆర్ఓ ప్లాంట్లోని నీటిని కొనితెచ్చుకొని తాగుతున్నారన్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే ఒక మహిళచేత చెత్త ఊడ్పిస్తున్నారన్నారు. పారిశుద్ధ్యం లోపించటంతో దోమలు, ఈగలు కారణంగా జ్వరాలతో విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. ఇంజినీరింగ్, ఇంటర్ విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారన్నారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, మాదిగ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ కందుల ఎజ్రా, గంటెనపాటి గాబ్రియేలు, కుక్కల పౌలు, మైలేరి మార్క్, వేణుమాధవ్, మణికంఠారెడ్డి, షాయాబ్, శాంతకుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదేనా సంక్షేమం?!