
వంతెనపై ప్రయాణం.. భయం !
పూడుకుపోయిన పంట కాలువ
నకరికల్లు: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే వంతెనపై ప్రయాణం ప్రమాదంగా మారింది. మండలం పరిధిలోని నకరికల్లు – మాచర్ల రహదారిలో బెల్లంకొండ బ్రాంచికెనాల్ వంతెనపై ప్రమాదం పొంచి ఉంది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అల్యూమినియం సైడ్వాల్స్ విరిగిపోయాయి. దీంతో వాహనాలు అదుపుతప్పితే కెనాల్లో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఇదే ప్రదేశంలో అదుపుతప్పిన లారీ కెనాల్లో పడిపోయింది. ప్రాణాపాయం తప్పినప్పటికీ వాహనం మొత్తం నుజ్జునుజ్జయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వరమే వంతెనకు సైడ్వాల్స్ను పటిష్టం చేసి, వంతెనకు ఇరువైపులా పూర్తిస్థాయిలో వాటిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
ధ్వంసమైన అంతర్గత సైడ్వాల్స్
బెల్లంకొండ బ్రాంచి కెనాల్ పరిధిలో నకరికల్లు, రాజుపాలెం మండలాల పొలాలకు సాగునీటిని సరఫరా చేస్తారు. నర్శింగపాడు గ్రామం సమీపంలోని వంతెన వద్ద సాగునీరు సక్రమంగా కెనాల్లో పయనించేందుకు, కట్ట కోతకు గురికాకుండా సైడ్వాల్స్ను నిర్మించారు. ప్రస్తుతం సైడ్వాల్స్ పూర్తిగా దెబ్బతిని ధ్వంసమై ఉన్నాయి. సైడ్వాల్స్ పగిలిపోయిన కారణంగా కట్ట కోతకు గురికావడం, గండిపడడం, సాగునీటి వృధా అయ్యే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం కంటికి కనిపించే సమస్య అయినప్పటికీ అంతర్గత సైడ్వాల్స్కు మరమ్మతులు చేయడంపై ఎన్నెస్పీ అధికారులు దృష్టిసారించడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
రక్షణ గోడలు నిర్మించాలి
నర్శింగపాడు సమీపంలోని బెల్లంకొండ బ్రాంచికెనాల్ కాలువపై గల వంతెన రక్షణ గోడలు పూర్తిగా విరిగిపోయాయి. గతంలో వాహనాలు ఢీకొని అల్యూమినియం వాల్స్ విరిగిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు స్పందించి సత్వరమే మరమ్మతులు చేపట్టాలి.
– ముజావర్ జాన్అహ్మద్, స.హ.చట్టం ప్రచార ఐక్యవేదిక
జిల్లా కార్యదర్శి
బెల్లంకొండ బ్రాంచి కెనాల్ నుంచి పొలాల్లోకి సాగునీరు సరఫరా చేసే పంటకాలువ పిచ్చిచెట్లు, ముళ్లపొదలు, గడ్డితో పూడుకుపోయింది. కనీసం కాలువ కూడా కనిపించే పరిస్థితి లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న తరుణంలో సాగునీటి సరఫరా అవశ్యం. కానీ పంటకాలువ పూడిపోవడంతో పొలాలకు నీరుచేరే అవకాశం కన్పించడం లేదు. సాగునీటి విడుదలకు చాలా సమయం పట్టినప్పటికీ పంటకాలువను సిద్ధం చేసుకోవడంలో అధికారులు దృష్టి సారించకపోవడంతో పొలాలకు సాగునీరు సక్రమంగా చేరుతుందా అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొని ఉంది.
●
బెల్లంకొండ బ్రాంచి కెనాల్ వంతెనపై పొంచి ఉన్న ప్రమాదం
కూలిపోయిన సైడ్ వాల్స్
శిథిలావస్థకు చేరిన అంతర్గత
సైడ్ వాల్స్
పట్టించుకోని అధికారులు

వంతెనపై ప్రయాణం.. భయం !

వంతెనపై ప్రయాణం.. భయం !

వంతెనపై ప్రయాణం.. భయం !