
గిట్టుబాటు లేని సేద్యం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఆళ్ల వెంకటేశ్వర్లు. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు ఈయన. గత ఏడాది ముప్పాతిక ఎకరం కౌలుకు తీసుకొని పసుపు పంట సాగు చేశాడు. సుమారు రూ.30వేల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అదే పొలంలో మరలా పసుపు సాగు చేశాడు. విత్తన కొమ్ము పుట్టి రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. సాగు వ్యయం గత ఏడాది కంటే రూ.25వేలు పెరిగింది. తీరా పంట వేశాక కాలువలకు నీరు రావటంతో పాటుగా, వర్షాలు ఎక్కువగా ఉండటంతో నేలలోని తేమ శాతం అధికంగా ఉండి నేలపుచ్చు వచ్చి దిగుబడి తగ్గింది. గత ఏడాది క్వింటా రూ.13,300కి చేలోనే కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.11వేలకు మాత్రమే అడుగుతున్నారని పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని దిగులు పడుతున్నాడు.
ముప్పాళ్ల: కూటమి ప్రభుత్వం రైతులపై చిన్నచూపు చూస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుండటంతో ఈ ఏడాది సాగు చేసిన రైతులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. ప్రధానంగా వాణిజ్య పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ ఏడాది పసుపు పంట సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా వస్తుందో రాదో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల బారినుంచి పంటను కాపాడుకొని పంట దిగుబడులు చేతికందే సమయానికి ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో రైతు కుదేలవుతున్నాడు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో రైతుల్లో ఆందోళన మరింతగా పెరిగింది.
200 హెక్టార్లలో సాగు
సబ్డివిజన్ పరిధిలో ఈ ఏడాది సుమారు 200 హెక్టార్లలో పసుపు పంట సాగు చేశారు. అధికంగా ముప్పాళ్ల మండలంలోనే సాగవుతోంది. ఎకరాకు రు.లక్ష పైనే రైతులు పెట్టుబడి పెట్టారు. విత్తనం కొనుగోలు సమయంలో పుట్టి రు.7,500 నుంచి రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేశారు. ఎకరాకు రు.50వేల వరకు విత్తనం కొమ్ముకు ఖర్చుచేశారు. కూలీ ధర కూడా పెరిగింది. సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల కావటంతో పాటుగా వర్షాలు అధికంగా ఉండటంతో కొమ్ముకు భూమి పుచ్చు ఏర్పడి దిగుబడి పైన ప్రభావం చూపింది. తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకునేందుకు అధికంగా పురుగుమందులకు ఖర్చు చేయాల్సి వచ్చింది. అన్ని కలిపితే ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.10లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది పంట చేతికందే సమయానికే క్వింటా రూ.13,300 చొప్పున కల్లంలోనే కొనుగోలు చేశారు. ఈ ఏడాది కొమ్ము ఆరలేదంటూ రూ.10,500 నుంచి బేరం జరుపుతున్నారని రైతులు వాపోతున్నారు.
ధర లేక పసుపు రైతు విలవిల
పెరిగిన సాగు వ్యయం..
తగ్గిన దిగుబడులు
లభించని గిట్టుబాటు ధర
మార్క్ఫెడ్ ద్వారా కొనేందుకు
ముందుకురాని ప్రభుత్వం
పెట్టుబడి కూడా వచ్చేలా లేదని
రైతుల ఆందోళన

గిట్టుబాటు లేని సేద్యం

గిట్టుబాటు లేని సేద్యం