● వీసీల సదస్సు ముగింపు
● పరిశోధనలు, ఉపాధి కల్పనపై చర్చ
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని సృష్టించి ఆవిష్కరణల ప్రోత్సాహంతో వ్యక్తిత్వ, నాయకత్వ లక్షణాలతో చైతన్యవంతమైన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని వైస్ చాన్స్లర్లకు గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్ల సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయాలు కేవలం డిగ్రీ హోల్డర్లను మాత్రమే కాకుండా సమర్థులైన పౌరులను, సమస్య పరిష్కర్తలను, ఆవిష్కర్తలను, దేశ నిర్మాతలను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. పరిపాలన సంస్కరణలు, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీకరణ, ఉపాధి కల్పన, డిజిటల్ పరివర్తన, పారిశ్రామిక భాగస్వామ్యాలు, జాతీయ విద్యా విధానం అమలుపై సదస్సులో జరిగిన చర్చలు నిర్దిష్ట చర్యలుగా రూపుదిద్దుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. చాన్స్లర్గా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒడిశాలో ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేసే వాస్తవ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ, వ్యవస్థాపక, ఉ పాధి పథకాలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. తద్వారా యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉత్తమ పద్ధతులకు పేరుగాంచిన సంస్థలను సంయుక్తంగా సందర్శించి, విజయవంతమైన నమూనాలను తమ క్యాంపస్లకు అనుగుణంగా మార్చుకోవాలని ఆయన వైస్ చాన్స్లర్లను ప్రోత్సహించారు. ఉన్నత విద్యా సంస్థల దీర్ఘకాలిక వృద్ధి, అభివృద్ధికి సంస్థాగత ఆస్తులను పరిరక్షించడం అత్యవసరం. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ అనేక సంస్థలు ఆక్రమణలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొత్త ఆక్రమణలను నివారణకు అప్రమత్తతో కూడిన సమర్థవంతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఆయన విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. క్యాంపస్ జీవితంలో భాగంగా ఉపయోగించని భూమిని మొక్కలు నాటే కార్యక్రమాలతో పచ్చదనం విస్తరణకు వినియోగించుకోవాలని కోరారు. ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని, ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవడం సంస్థల సమాన బాధ్యతగా గవర్నరు పేర్కొన్నారు. పైకప్పు స్థలాలను ఉపయోగించుకుని సౌర విద్యుత్ ఉత్పత్తితో సంప్రదాయ విద్యుత్ అవసరాలను కొంతమేర తీర్చుకోవాలని గవర్నరు ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను అన్వేషించి పునరుత్పాదక ఇంధన సేవా సంస్థ (రెస్కో) నమూనాను అనుసరించాలని సూచించారు.
సదస్సు చివరి రోజున రెండు సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో వివిధ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్లు పలు సమకాలీన అంశాల్ని ప్రదర్శించారు. హరిత ఇంధనం, సుస్థిరత కార్యక్రమాలు, క్వాంటం కంప్యూటింగ్, వర్ధమాన సాంకేతికతలు, సంస్థాగత పాలనలో ఉత్తమ పద్ధతులు, విద్యా నైపుణ్యం వంటివి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడారు. గవర్నర్ సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉన్నత విద్యా సంస్థలన్నింటిలో నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలను విస్తరిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.


