భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. అక్షయ తృతీయ నుంచి మొదలైన రథ తయారీ పనులు 42వ రోజు సరికి ఇరుసుకు చక్రాల అమరిక పూర్తి కావడం విశేషం. ప్రధాన మహారణ మార్గదర్శకంలో రథ కార్మికులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. సాధారణంగా శీతల షష్టి నాటికి పూర్తి కావలసిన చక్రాల అమరిక చాలా ముందుగానే పూర్తి చేశారు. భంవురి రోజున లాంచనంగా 3 రథాల ఇరుసుకు చక్రాల అమరికను పూర్తి చేశారు. 41వ రోజున 3 రథాల 18 ఇరుసులకు 36 చక్రాలను భోయ్ సేవకులు అనుసంధానించి హరీ బోల్ నినాదంతో ఉర్రూతలూగారు. మొదటగా తాళ ధ్వజ రథం 6 ఇరుసులకు 12 చక్రాలను, నంది ఘోష్ రథం 7 ఇరుసులకు 14 చక్రాలను, దేవ దళన్ రథం 5 ఇరుసులకు 10 చక్రాలను అనుసంధానించడంతో చక్రాల అమరిక ప్రక్రియను పూర్తి చేశారు. దీని తర్వాత రథాల పైభాగం పనులు అంచెలంచెలుగా ఊపందుకుంటాయి. ఈ దశ పనుల్లో రూపకారుల పాత్ర పుంజుకుంటుంది. అలాగే కమ్మరి వర్గం సేవకులు పలు పరిమాణాల మేకులు వగైరా తయారీలో తలమునకలై ఉన్నారు. ఇలా పలు రకాల పనుల్లో 205 మంది సేవకులు పని చేస్తున్నారు. మూడు రథాల తయారీ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 3 రథాలకు చెందిన 21 ఇరుసులకు 42 చక్రాలు అనుసంధానం పూర్తి చేశారు. ఆ తర్వాత రథం యొక్క ఇతర భాగాలను దశల వారీగా అమర్చుతారు. రూపకార్ సేవకులు మూడు రథాలలోని వెలుపలి భాగాల్లో సింహం, ఏనుగు చెక్కడం పనుల్లో హడావిడిగా ఉన్నారు.


