మల్కన్గిరి:
వికసిత ఒడిశా విజన్ 2036–47 లక్ష్యంగా రాష్ట్రంలో అమలవుతున్న మోడల్ విలేజ్ విజన్, స్వాభిమాన్ ప్రాంతాభివృద్ధి కోసం కొనసాగుతున్న సేతు పథకంపై ఉన్నత స్థాయి సంయుక్త సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగిన సమావేశంలో చిత్రకొండ సమితి స్వాభిమాన్ ప్రాంతంతో పాటు మొత్తం జిల్లా సమగ్ర అభివృద్ధి, రూపాంతరణపై విస్తృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్యఅభివృద్ధి అధికారి దశరాథి సరాబు మోడల్ విలేజ్ మిషన్ అమలు విధానాన్ని వివరించారు. గ్రామాలకు, పట్టణస్థాయి సౌకర్యాలను అందించి.. వాటిని స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడమే మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రత్యేకంగా చిత్రకొండ సమితిలోని 18 పంచాయతీలు, కోరుకొండ సమితిలో నక్కమామిడి పంచాయితీ చేర్చబడ్డాయి. ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.


