కన్న కొడుకే కాలయముడు | - | Sakshi
Sakshi News home page

కన్న కొడుకే కాలయముడు

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

పచ్చటి గ్రామంలో రక్తం చిందింది. మానసిక సమస్యలకు తోడైన తాగుడు అలవాటు ఓ మనిషిని హంతకుడిలా మార్చింది. ఎవరి చేయి పట్టుకుని నడక నేర్చుకున్నాడో, ఎవరి గుండెలపై ఆడుకున్నాడో, ఎవరి రక్తం పంచుకుని పుట్టాడో ఆ వ్యక్తి మీదే దాడికి తెగబడేంతలా పరిస్థితి మారింది. తల కొరివి పెట్టాల్సిన కొడుకే ఆయుష్షును తీసేయడంతో పెద్ద లోహరిబంద బోరున విలపించింది.

మందస: పెద్ద లోహరిబంద ఆదివారం రోదించింది. కొడుకు చేతిలో కన్నతండ్రి హతం కావ డంతో ఊరుఊరంతా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన తాళ్ల ఏకాంబరరావు పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీని కోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. దీనికి తోడు ఆయనకు తాగుడు అలవాటు ఉంది. ఈ నేప థ్యంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఏకాంబరరావుకు ఆయన తండ్రి తాళ్ల లక్ష్మీ నారాయణ(60)కు గొడవ జరిగింది. ఈ గొడవలో ఏకాంబరరావు విచక్షణ కోల్పోయి తండ్రిని తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గొడవ జరిగాక ఏకాంబరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతడిని చూసిన చిన్న కోడలు ఇంటిలోకి వెళ్లి చూడగా లక్ష్మీ నారాయణ రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఆమె తన భర్త గోపికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారికి కూడా విషయం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హరిపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

తండ్రిని చంపిన తనయుడు

పెద్దలోహరిబందలో ఘటన

మానసిక సమస్యలతో బాధ పడుతున్న కొడుకు

Advertisement
 
Advertisement
Advertisement