రాయగడ: ఒక దోపిడీ కేసుకు సంబంధించి సదరు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో రాజేష్ శెఠి అలియాస్ రాజ, రాజనీరాణి శెఠి అలియాస్ రోజి, దేవాశిష్ పాడి, యశ్వంత్ నాయక్ అలియస్ యేసు, హరేష్ రత్నాలు ఉన్నారు. నిందితుల నుంచి వంట గ్యాస్ సిలిండర్, గ్రైండర్, రెండు స్పీకర్లు, రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కెటిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక రింగ్రోడ్డు సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం ఎదురుగా ఉన్న కాలనీలో నివసిస్తున్న బసంత కుమార్ మిశ్రో అనే వ్యక్తి ఇంట్లో మార్చి 12వ తేదీ అర్ధరాత్రి దుండగులు చొరబడి, మరణాయుధాలతో భయపెట్టి ఇంట్లో చోరీ చేశారు. దీనిపై సదరు పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
రాయగడ: సదరు సమితి కొత్తపేట గ్రామ దేవతగా పూజలందుకుంటున్న బంగారమ్మ తల్లి విగ్రహ, మందిర ప్రతిష్టోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంకు చెందిన ప్రముఖ యజ్ఞ యుగకర్త ఎస్ఎల్వీఎన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం రక్షణ కంకణాధారణ, కలశ, జలాభిషేకం, సన్నిహాకము, గో మాతృకా ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రముఖులు, గ్రామస్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.
బైక్ షోరూమ్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: బాలాసోర్లోని టీవీఎస్ బైక్ షోరూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వాహనాలు ధ్వంసమయ్యాయి. షోరూమ్ మూసి ఉన్న సమయంలో మంటలు చెలరేగినట్లు యాజమాన్య వర్గాల సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలం చేరి మంటలను నివారించారు.
312 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ముందస్తుగా అందిన సమాచారం మేరకు మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు దాడులు నిర్వహించా చిత్రకొండ–బలిమెల ప్రధాన రహదారి నూవగూఢ గ్రామ అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసిన గంజాయితో ఉన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వేరే రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు సిద్ధం చేసినట్టు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయినిచిత్రకొండ అదనపు తహసీల్దార్, ఎస్డీడీవో ప్రదోష్ ప్రధాన్ ఆధ్వర్యంలో తూకం వేయగా 26 బస్తాల్లో 312 కిలోలు ఉన్నట్టు తేలింది. దీని విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాన్ పట్నాయక్ తెలిపారు. ఈ గంజాయి ఎవరిదో తేల్చాలని తహసీల్దార్ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసి పట్టుబడిన గంజాయిని కోర్టు అవరణకు తరలించారు .


