రాయగడ: ఇంట్లో తయారు చేసుకున్న పుల్లట్లు తిన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీలోని చొంచాడగుడ గ్రామంలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే కల్యాణ సింగుపూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. చొంచాడగుడ గ్రామానికి చెందిన డాలింబొ కర్గమా, పన్నెండేళ్ల మణికాంత్ కర్గమ, పదేళ్ల జితేంద్ర కర్గమలు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మినపగుళ్లు, బియ్యంతో తయారు చేసిన పుల్లట్లను తిన్నారు. తిన్న రెండు గంటల తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయితే అందరూ ఇదే పరిస్థితి రాత్రి వరకు అనుభవించడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే తయారు చేసిన పుల్లట్లలో విషపూరిత పదార్థం కలిసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.


