జయపురం:
కొరాపుట్ జిల్లా ధమన్జొడి నాల్కో సంస్థ నిర్వహిస్తున్న 25 వ పంచమటమాలి నాట్య మహోత్సవాల్లో శుక్రవారం సాయంత్రం జయపురం సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రదర్శించిన ’కిన్నెర’ నాటకం అభినందనలు పొందింది. ఈ నాటకోత్సవాల్లో జయపురం కళాకారులు ప్రదర్శించిన రెండో నాటకం ‘కిన్నెర’. ఒక కిన్నెర జీవిత గాథను ఆధారంగా తీసుకొని రూపొందించిన ఈ నాటకంలో సమాజంలో కిన్నెరలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, సామాజిక వివక్ష, గృహ హింస తదితర సమస్యలను నాటకంలో ప్రతిబింబింపచేశారు. అదే సమయంలో కిన్నెర అయినప్పటికీ ప్రపంచంతో పోరాడుతూ, ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన ‘మీనూ’ పాత్ర ద్వారా ప్రేరణాత్మక సందేశాన్ని సమాజానికి అందించారు రచయిత శేఖర్ దాస్. విద్య, పట్టుదలతో ప్రజల మనసులను గెలవవచ్చని కష్టపడి సమాజానికి సేవ చేసి గుర్తింపు పొందవచ్చని ఈ నాటకం ద్వారా రచయిత సందేశ మిచ్చారు. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందించిన ఈ నాటకానికి దర్శకుడు నిరంజన్ పాణిగ్రహి. ఈ నాటకానికి పిల్లన గ్రోవితో అద్భుత మైన సంగీతం అందించారు సంగీత కళాకారుడు జి. మహేష్, ఆకాశ వాణి కళాకారుడు ఈశ్వర్ షరాఫ్.


