విద్యాదానం కార్యక్రమం ప్రారంభం
రాయగడ: పట్టణంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పేందుకు స్థానిక శిష్టకరణాల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక శ్రీరామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో విద్యాదానం కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ నెలకు రెండు రోజులు 5 నుంచి 8వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు తమ సంఘం ద్వారా ఉచితంగా పాఠాలు చెప్పేందుకు విద్యాదానం పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధ్యాయులు హరిశంకర్ పట్నాయక్, లక్ష్మీప్రసాద్ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి సారధి పట్నాయక్, సభ్యులు గిరీష్ పట్నాయక్, కేకేఎం పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


