రాయగడ: వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గంగమ్మ ఒడిలోకి గణనాథులు చేరుకుంటున్నారు. స్థానిక బాలాజీనగర్లోని కల్యా ణ వేంకటేశ్వర ఆలయంలొ ఉత్కళ బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక ఉత్సవాలు శనివారంతో ముగిశా యి. ఈ సందర్భంగా గణనాథుని ఊరేగింపు గా తీసుకెళ్లిన సభ్యులు స్థానిక నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో మూడు రాత్రులు పూజలను నిర్వహించిన గణనాథులకు నిమజ్జనాలు చేస్తున్నారు.
ఇళ్లలోకి మురుగు, వర్షం నీరు
జయపురం: జయపురం పట్టణంలో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి పారుతోందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమైందని పట్టణ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై కలెక్టర్ దృష్టి సారించటం లేదని, ముఖ్యమంత్రి మోహన్ మఝి ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ పాత్రికేయుడు, సమాజ సేవకుడు నరశింగ చౌధురి సీఎంకు లేఖ రాశారు. జయపురం మున్సిపాలిటీలో పర్మినెంట్ కార్యనిర్వాహక అధికారి లేకపోవటం వల్ల తాత్కాలిక అధికారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై దృష్టి సారించడం లేదన్నారు. 2009లో బీజేడీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సమయంలో జయపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రూ.2 కోట్లు మంజూరు చేశారని, ఆ డబ్బు సరిపోదని జయపురం మున్సిపాలిటీకి సెవెరేజ్ బోర్డు రిటన్ చేసిందని, తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. వానలకు పరిస్థితి అధ్వానంగా మారుతోందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై దృష్టి సారించాలని కోరారు.
విజిలెన్స్ కేసులో జూనియర్ ఇంజినీర్కు జైలుశిక్ష
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గ్రామీణ తాగునీరు, శానిటేషన్ డివిజన్లో జూనియర్ ఇంజినీర్గా పనిచేసిన అరున్ జెన్నా రెండేళ్ల కిందట విజిలెన్స్ అధికారుల వలలో పడ్డాడు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు కేసు పెట్టారు. ప్రస్తుతం ఆయన మయూర్భంజ్ జిల్లా సర్వశిక్షా అభియాన్లో జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటరుగా పనిచేస్తున్నారు. ఆయనపై ఉన్న విజిలెన్సు కేసులు విచారించిన బరిపద విజిలెన్సు స్పెషల్ జడ్జి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. అరుణ్ కుమార్ జెన్నాను ప్రభుత్వ విధుల నుంచి బహిష్కరించాలని సంబంధిత ప్రభుత్వ శాఖకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. ఈ కేసులో విజిలెన్స్ అధికారి బాలసోర్ నరేంద్ర బెహారా అప్పట్లో కేసు ఫైల్ చేయగా, స్పెషల్ పీసీ బరిపద సంతును దాస్ ప్రాసిక్యూషన్ చేశారు.
చెట్టును ఢీకొన్న బైక్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా–కలిమెల సమితి మధ్య రహదారిలో శనివారం ఓ యువకుడు బైక్తో చెట్టును ఢీకొని మృతి చెందాడు. కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీలో ఏదో పని మీద వచ్చి తిరిగి ఎంవీ 58 గయరామాం గ్రామానికి వెళ్తున్న నరేష్ సర్దార్ అనే యువకుడు బైక్తో చెట్టును ఢీకొన్నాడు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. కలిమెల పోలీసులు విషయం తెలుసుకుని ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకుని ఐఐసీ ముకుందోమేల్క కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
గంగమ్మ చెంతకు గణనాథులు