
తొమ్మిది ఎకరాల జొన్న పంట ధ్వంసం
● లబోదిబో మంటున్న రైతులు
● పట్టించుకోని అటవీశాఖ అధికారులు
కొమరాడ: మండలంలోని గుమడ గ్రామానికి చెందిన చిప్పాడ గౌరునాయుడు, గరుగుబిల్లి శంకరరావులకు చెందిన తొమ్మిది ఎకరాల్లోని జొన్న, పత్తి పంటలను ఇటీవల కోటిపాం పరిసరాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా నాశనం అయితే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదుని ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దిక్కు లేదుంటూ లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు వేలాది ఎకరాల్లో పంటనష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నటికీ ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగులను తరలించే ప్రకియ చేపడతామని మాటలు చెబుతోందే కానీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు, రైతులు వాపోతున్నారు.