
భారీగా విదేశీ మద్యం పట్టివేత
మల్కన్గిరి: జిల్లాలోని పోడియా సమితిలో పోడియా పోలీసులు సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 165 లీటర్ల విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో రవాణా చేస్తున్న ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయనను విచారించగా కలిమెల సమితి ఉండ్రుకొండ గ్రామంలో ఈ మద్యం అమ్మకానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలించినట్లు పోడియా ఐఐసీ నిరోద్ కుమార్ బాగ్ తెలియజేశారు.
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: శ్రావణమాసం పవిత్ర దినాల్లో భాగంగా మంగళవారం స్థానిక బాలాజీ నగర్లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో పుత్రదా ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. పూజల్లో అధికసంఖ్యలో మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అగ్ని ప్రమాదంలో ఇల్లు
దగ్ధం
జయపురం: జయపురం పట్టణంలోగల హైదరాబాద్ లైన్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. హైదరాబాద్ లైన్లో సయ్యద్ మహమ్మద్ ఇంటిలో ఎలక్ట్రికల్ సామాన్లు ఇతర వస్తువులు అగ్ని ప్రమాదంలో కాలి పోయాయి. అగ్ని ప్రమాదం మంటలు చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి తెలియ జేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో కాలిపోయిన వస్తువుల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని ఇంటి యజమాని వెల్లడించారు. అగ్నిమాపక విభాగ ఏఎస్సీ బారిక్ అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విషయం తెలిసి మహమ్మద్ కుటుంబం ఇంటికి చేరుకున్నారు.
చోరీ కేసులో ఐదుగురికి జైలు శిక్ష
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులకు జిల్లా అదనపు జడ్జి వర్షా దాస్ మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. అదేవిధంగా ఒక్కొక్కరూ రూ.10 వేల జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో 7 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్ష పడినవారిలో అశ్రఫుల్ షేక్, మహ్మద్ రాని శేఖ్, మహ్మద్ అలిమిన్, శేఖ్ బాబు, సమీర్ శేఖ్లు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 13వ తేదీన స్థానిక డీఎఫ్వో కార్యాలయం సమీపంలోని మూడోలైన్లో నివసిస్తున్న బసంత కుమార్ స్వయి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో తమ సొంత గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో మే 17వ తేదీన గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోని రూ.60 వేల నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించుకు వెళ్లినట్లు మే 18వ తేదీన బాధితుడు బసంత కుమార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి సోమవారం 11 మంది సాక్షులను విచారించిన న్యాయస్థాఽనం ఈ మేరకు నిందితులకు జైలు శిక్షను విధించింది.