
ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా డాబుగాం పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమరాహండి గ్రామానికి చెందిన చంచల మజ్జి అనే మహిళ పపడాహండిలో ప్రతిరోజూ కూరగాయలు విక్రయించి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెను గత కొంతకాలంగా జొరిగాం సమితి పట్రాసిల్ గ్రామానికి చెందిన పరశురాం శాంత, ముండాగుడ గ్రామానికి చెందిన రాకేష్ శాంతలు అనుసరిస్తున్నారు. ఇటీవల బాధిత మహిళ కన్యాశ్రమం వద్ద బస్సు దిగి తన గ్రామానికి వెళ్తుండగా వీరిద్దరూ ముఖానికి ముసుగులు వేసుకొని వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుని లాక్కొనిపోయారు. దీంతో బాధితురాలు చంచల డాబుగాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బంగారు గొలుసుని ఉమ్మర్కోట్లో విక్రయించి ఆ డబ్బులతో డాబుగాంలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిలదీయడంతో నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి నగదు, నంబర్ ప్లేట్లేని బైక్ స్వాధీనం చేసుకున్నారు.