
రథ చక్రాలు సిద్ధం
భువనేశ్వర్: జగతి నాథుని యాత్ర కోసం 3 రథాల తయారీ పనులు అంచెలంచెలుగా పూర్తవుతున్నాయి. నిర్ధారిత కాల పరిమితిలో ఈ పనుల్ని పూర్తి చేయడంలో వడ్రంగి సేవకులు నిరవధికంగా శ్రమిస్తున్నారు. రథాల్ని నడిపించే చక్రాల తయారీ ప్రధాన ఘట్టం. ఈ ఘట్టం విజయవంతంగా ముగించారు. అంచెలంచెలుగా 3 రథాల కోసం అవసరమైన 42 చక్రాల తయారీ పూర్తి చేశారు. మరో వైపు తయారైన చక్రాల్ని అమర్చేందుకు ఇరుసు పనులు చకచకా సాగుతున్నాయి. దశలవారీగా తయారు చేస్తున్న ఇరుసులకు చక్రాల్ని జోడించే పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పనులు పూర్తి కావడంతో రథం పైఅంతస్తు రూపుదిద్దుకుంటుంది. అందుకు అవసరమైన పనులు ప్రారంభించారు. దేవదేవుళ్లు యాత్ర చేసే 3 రథాలు నడిపేందుకు సమగ్రంగా 42 చక్రాలు అమర్చుతారు. అత్యధికంగా శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథానికి 16 చక్రాలు అమర్చుతారు. బలభద్ర స్వామి తాళ ధ్వజం కోసం 14 చక్రాలు మరియు దేవీ సుభద్ర యాత్ర చేసే దర్ప దళనం కోసం 12 చక్రాలు తయారీ పూర్తయ్యింది.

రథ చక్రాలు సిద్ధం