
ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ విజయవంతం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా), భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) భువనేశ్వర్ సమన్వయంతో ఆదివారం నిర్వహించిన ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 విజయవంతమైంది. స్థానికుల్లో శారీరక దారుఢ్యతపై చైతన్యపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్థానిక మండల రైల్వే అధికారి డీఆర్ఎం హెచ్ఎస్ బజ్వా తెలిపారు. ఎనిమిదేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, మహిళలు, బాలబాలికలు సహా 1,200 మందికి పైగా ఔత్సాహిక వ్యక్తులు ఈ భారీ పరుగు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు.
అథ్లెటిక్స్లో అర్జున అవార్డు గ్రహీత ద్యుతీ చాంద్, డీఆర్ఎం హెచ్ఎస్ బజ్వా, తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ ఖుర్దారోడ్ శాఖ అధ్యక్షురాలు గుర్ సిమ్రాన్ కౌర్, ఐఐటీ, భువనేశ్వర్ ప్రొఫెసర్ రాజేష్ రోషన్ దాస్ జెండా ఊపి హాఫ్ మారథాన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుభ్రజ్యోతి మండల్, అదనపు మండల రైల్వే అధికారి (ఇన్ఫ్రా), పీకే బెహరా అదనపు మండల రైల్వే అధికారి (ఓపీ), క్రీడాధికారి హిమాద్రి భూషణ్ బిస్వాల్ పాల్గొన్నారు.
హాఫ్ మారథాన్ స్థానిక రైల్వే స్టేడియం నుంచి ప్రారంభమై ఐఐటీ భువనేశ్వర్ నుంచి వెనుకకు మలుపు తిరిగి (యూ–టర్న్) రైల్వే స్టేడియంలో ముగిసింది. నాలుగు విభాగాలుగా పోటీ నిర్వహించారు. వాటిలో 21.1 కిలో మీటర్ల టైమ్ రన్, 10 కిలో మీటర్లు టైమ్ రన్, 5 కిలో మీటర్లు ఫన్ రన్, 2 కిలోమీటర్ల ఫన్ రన్ ఉన్నాయి. విజేతలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. సమగ్రంగా 2 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 24 మంది విజేతలు బహుమతులు అందుకున్నారు.
ఊర్మిల ఝలక్
విజయవంతమైన ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 పరుగు పందెంలో 74 ఏళ్ల వయో వృద్ధ మహిళ ఊర్మిళ దాస్ తళుక్కుమన్నారు. 7 దశకాల వయసు మీరిన ఊర్మిళ అలుపు ఎరగకుండా సుదీర్ఘంగా 5 కిలో మీటర్ల ఫన్ రన్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మారథాన్లో పాల్గొన్న అతి పెద్ద వయస్కురాలిగా ఆమెను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.

ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ విజయవంతం