
బీజేడీలోకి పలువురి చేరిక
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీ తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో నబరంగ్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దిలీప్ ప్రధాని బీజేడీ పార్టీలో చేరారు. ఆదివారం శంఖ భవన్లో జరిగిన కార్యక్రమంలో దిలీప్ చేరికను ఒడియా సినీ హీరో, రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్ ప్రకటించారు. తెంతుల కుంటి సమితిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సమితి సభ్యులు, ముగ్గురు సర్పంచ్లు బీజేడీలో చేరారు. వీరిని పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్ర స్వాగతం పలికారు.
ఎందుకీ పార్టీ ఫిరాయింపు...
సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక ప్రాంతాల్లో బీజేడీ, కాంగ్రెస్లను వీడి అనేక మంది అధికార బీజేపీలో చేరారు. కానీ నబరంగ్పూర్ జిల్లాలో బీజేడీలో చేరికల పట్ల అనేక రాజకీయ మలుపులు ఉన్నాయి. నబంరగ్పూర్ నుంచి 9 సార్లు ఎంపీగా గెలిచిన ఖగుపతి ప్రధాని మనుమడు దిలీప్ ప్రధాని. ఇదే స్థానంలో ఖగుపతి తమ్ముడు మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ కుమారుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో తనను తెంతులకుంటి సమితి చైర్మన్ చేయమని సదాశివను దిలీప్ అభ్యర్థించారు. దిలీప్ కాంగ్రెస్ను వీడి బీజేడీలోనికి వస్తే చైర్మన్ చేస్తామని సదాశివ బదులిచ్చారు. దిలీప్ పార్టీ మారకపోవడంతో బీజేడీకి చెందిన నీలాద్రిని చైర్మన్ను చేశారు. దీంతో స్వంత చిన్నాన్న సదాశివను ఓడిస్తానని ప్రతిన బూని దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గౌరి శంకర్ మజ్జి గెలిపొందారు. దిలీప్ ప్రస్తుతం తెంతులకుంటి సమితి సభ్యునిగా ఉన్నారు. తెంతులకుంటి సమితి చైర్మన్గా బీజేడీకి చెందిన నీలాద్రి మజ్జిపై పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలిసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రంధారి రంగంలోకి దిగి దిలీప్ ప్రధానితో చర్చలు జరిపారు. ఉన్న చైర్మన్ను అవిశ్వాసం పెట్టి దించేస్తామని హామీ ఇచ్చారు. గతం మర్చి పోయి బీజేడీలో చేరితే అందరం కలిసి చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో దిలీప్ తన మద్దతుదారులతో బీజేడీలో చేరారు.