‘సైబర్‌’కు సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

‘సైబర్‌’కు సిబ్బంది కొరత

Jun 2 2025 12:22 AM | Updated on Jun 2 2025 12:22 AM

‘సైబర్‌’కు సిబ్బంది కొరత

‘సైబర్‌’కు సిబ్బంది కొరత

శ్రీకాకుళం క్రైమ్‌ : సైబర్‌ ఫ్రాడ్స్‌.. ప్రపంచం ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. చిన్నోళ్లని చిదిమేస్తుంది.. పెద్దోళ్లను కబళించేస్తుంది.. తారతమ్యాల్లేవు.. ఎంతటి తెలివైన వారైనా సరే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్‌ మోసగాళ్ల వలలో పడి ఆర్థికంగా చితికిపోవాల్సిందే. నిన్న మొన్నటి వరకు జిల్లాలో మేజర్‌ సైబర్‌ కేసులు (రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల్లోపు) అధికంగా నమోదయ్యాయి. ఇటీవల ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, యువత, ఉద్యోగస్థుల్లో వీటిపై అవగాహన ఏర్పడటం.. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు విద్యాసంస్థలు, స్టేషన్‌ పరిధి ముఖ్య కేంద్రాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించడం తదితర కారణాలతో కేసుల సంఖ్య కాస్తు తగ్గుముఖం పట్టింది. రూ. 10 వేలు నుంచి రూ. 20 వేలు లోపు చిన్న చిన్న కేసులు నమోదవుతున్నాయి.

అరకొరగా సిబ్బంది..

జిల్లాలోని ఐటీ కోర్‌ విభాగంలో ఓ ఏఎస్‌ఐతో కలిపి పది మంది సిబ్బంది ఉన్నారు. వారిలో హెచ్‌సీలు ముగ్గురు, మిగతా వారంతా కానిస్టేబుళ్లే. సైబర్‌ సెల్‌ విభాగానికొస్తే ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. రెండు విభాగాలకు ఇన్‌చార్జిగా సీఐ శ్రీనివాస్‌ ఉన్నారు. గతంలో ఇదే సైబర్‌ సెల్‌ విభాగానికి సాంకేతికతపై మెండుగా అవగాహన ఉన్న ఐదారుగురికి మించి సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలొచ్చి కూటమి ప్రభుత్వమేర్పడ్డాక.. అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి అనుకూలురుగా వ్యవహరించారని ముద్రపడి వీఆర్‌కు పంపించేశారు. కొంతమంది ఎస్‌ఐలు, దిగువ స్థాయి సిబ్బంది ఉన్నా వేరే కేసుల్లోనే వినియోగించుకోవడం.. సాంకేతికతపై ఎక్కువశాతం మందికి పట్టు లేకపోవడం ఇబ్బందికి కారణంగా కనిపిస్తోంది.

తగ్గని విధుల ఒత్తిడి..

జిల్లాలో వినూత్నమైన కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయి.. నిన్న మొన్నటి వరకు అన్యమత ప్రచారాల కేసు, భారీ చోరీ కేసులు, నకిలీ కరెన్సీ, మిస్సింగ్‌ వంటి కేసుల్లో టెక్నికల్‌గా ఛేదించే పనిలో పడ్డ సైబర్‌ నిపుణులు ప్రస్తుతం జిల్లాను పట్టి పీడిస్తున్న బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వంటి జూదాల్లో మునిగి తేలుతున్న ప్రధాన బుకీలు, ఏజెంట్లు, వారి లింకులు టెక్నాలజీ పరంగా కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు. ఇంత చేసినా బందోబస్తులకు, విజయవాడ శిక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అది మాటలకే పరిమితమైంది. ఒకవేళ వచ్చినా సాంకేతికంగా నిపుణులైన పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

ప్రస్తుతమున్న సిబ్బందిపై పని భారం

మాటలకే పరిమితమైన సైబర్‌

పోలీస్‌ స్టేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement