ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

ప్రాం

ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి

భువనేశ్వర్‌: బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు వియత్నాం సందర్శించిన రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి సరికొత్త ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు. ఒడిశా మరియు వియత్నాంలోని డా నాంగ్‌ నగరం మధ్య ప్రాంతీయ స్థాయి సంబంధాలను అన్వేషించాలని ప్రతిపాదించారు. వియత్నాం పర్యటనలో భాగంగా డా నాంగ్‌ పీపుల్స్‌ కమిటీ చైర్మన్‌ లే ట్రుంగ్‌ చిన్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఒడిశా ఘన చరిత్ర, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి కలిగిన రాష్ట్రమని వివరించారు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. డా నాంగ్‌ ఆసక్తి కలిగి ఉంటే, మన రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను బలపరిచేందుకు మనం అన్వేషించవచ్చునన్నారు.

డా నాంగ్‌ చారిత్రాత్మక నగరం

డా నాంగ్‌ భారీ పురోగతి సాధిస్తున్న అందమైన చారిత్రాత్మక నగరమని కంభంపాటి హరిబాబు ప్రశంసించారు. డా నాంగ్‌ ఒక ప్రధాన ఓడరేవు, ఉన్నత సాంకేతికత కేంద్రంగా, ఆర్థిక మరియు పర్యాటక కేంద్రంగా ఎదగడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. మధ్య వియత్నాంలో శక్తివంతమైన తీరప్రాంత నగరంగా డా నాంగ్‌ భారతదేశం మరియు వియత్నాం మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుద్ధుని పవిత్ర అవశేషాల కోసం చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు వియత్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బౌద్ధ మతం దాదాపు 1800 సంవత్సరాలుగా భారతదేశం, వియత్నాం మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరిచిందన్నారు. భారతదేశం బౌద్ధ వారసత్వాన్ని విలువైనదిగా పరిగణించి బౌద్ధ స్థలాల రక్షణ, సంరక్షణ మరియు ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు.

రెండు దేశాల మధ్య సహకారం

వాణిజ్యం, రక్షణ, పర్యాటకం, ఆరోగ్యం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, విద్య మరియు స్థిరమైన అభివృద్ధి వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. యోగా, సాంస్కృతిక మార్పిడి మరియు విద్యా సంబంధాలను ప్రోత్సహించడానికి భారత రాయబార కార్యాలయంతో కలిసి పని చేయడంలో డా నాంగ్‌ మద్దతును అభినందించారు. రెండు దేశాల మధ్య మరిన్ని ప్రత్యక్ష విమానాలు ఇరుప్రాంతాల ప్రజల సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడ్డాయని పేర్కొన్నారు. మధ్య వియత్నాంలోని మైసలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో పురాతన దేవాలయాలను పునరుద్ధరించడంలో భారత పురావస్తు బృందం చేసిన కృషిని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్‌ భారతదేశం మరియు వియత్నాం మధ్య సన్నిహిత చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలకు బలమైన చిహ్నంగా మారిందన్నారు.

వియత్నం పర్యటనలో గవర్నర్‌ హరిబాబు ప్రతిపాదన

డా నాంగ్‌ పీపుల్స్‌ కమిటీ చైర్మన్‌ లే ట్రుంగ్‌ చిన్‌తో సమావేశం

ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి 1
1/1

ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement