
పరిశ్రమల పేరిట ప్రకృతిని హరిస్తున్నారు
రాయగడ: పరిశ్రమలు ఏర్పాటైతే అభివృద్ధి సాధ్యమని ప్రజలను మభ్యపెట్టి ప్రకృతి సంపదలను హరించివేస్తున్నారని పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కాసీపూర్ కొంటామాల్ మైదానంలో పృకృతిక సురక్షా సమితి ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పృకృతిక సంపదలను ప్రైవేటు పరం చేస్తున్నాయని.. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోగలిగితేన మన సంపదలను కాపాడుకోవచ్చన్నారు. అందుకు అందరూ ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. రోజురోజుకూ పర్యావరణం సమతుల్యం అంచులు దాటిపొతున్న సమయంలో ఉన్న ప్రకృతి సంపదలను పోగొట్టుకుంటే భావితరాలు పర్యావరణ పరంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాసీపూర్ ప్రాంతం ప్రకృతి సంపదలకు పుట్టినిళ్లని.. వాటిని పోగొట్టుకుంటే మిగిలింది మనకు విషకాలుష్యమేనని భయాందోళన వ్యక్తం చేశారు.
పోలీసులు అడ్డుకుంటున్నారు..
పర్యావరణం కోసం పోరాడేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది ఎక్కడి విడ్డూరమని సామంతరాయ్ ప్రశ్నించారు. కొంటామాల్లో జరగనున్న సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన ప్రముఖ సమాజ సేవకురాలు, పర్యావరణ వేత్త మేధాపట్కేర్తోపాటు మరికొందరు ప్రముఖులను రాయగడలో పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తిరిగి పంపించివేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లేనని అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రకృతిని హరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తమ ఆందోళనలను, పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాలిసురక్షా సమితి అధ్యక్షుడు సుభా మాఝి మాట్లాడుతూ.. పర్యావరణం గురించి శాంతి యుతంగా ఆందోళనలు చేపడితే యంత్రాంగం అడ్డుకోవడం విచారకరమని అన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ ఆందోళనలు కొనసాగించడం తధ్యమని అన్నారు. కార్యక్రమంలొ పృకృతి సురక్షా సమితికి చెందిన దిగంబర్ దురియా, సురేష్రావు, శుభేంద్ర ములిక, సంగ్రామ్ కేసరి, సనాతన్ ప్రధాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్

పరిశ్రమల పేరిట ప్రకృతిని హరిస్తున్నారు