
పార్టీలో విభేదాల్లేవు
రాయగడ: బీజేడీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామని మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు ప్రమీల మల్లిక్ అన్నారు. జిల్లాలోని బిసంకటక్, రాయగడ, గుణుపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ఆమెతో పాటు మాజీ మంత్రి పద్మనాభ బెహరలు రాయగడ వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక తేజస్వీ హోటల్లో కార్యకర్తలు, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఏదో చేసేస్తుందనే ఆశతో గెలిపించారన్నారు. ఆ పార్టీ సంవత్సర కాలంలో చేసిందేమిటో అందరికీ అర్థమైందన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా వినియోగదారులకు ఇస్తామని హామీ ఇచ్చారని, అలాగే చిట్ ఫండ్ మోసాలకు గురైన బాధితులకు అండగా నిలుస్తామని ఇచ్చిన హామీలో ్ల ఒక్కదాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు విరక్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా బీఎస్కేవై (బిజు స్వాస్థ కళ్యాణ యోజన పథకం)ను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం యుష్మాన్ కార్డును ఇచ్చిందని.. అయితే ఈ కార్డు చూపిస్తే ఏక్కడా ఉచితంగా వైద్యం అందించడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఆ పార్టీకి త్వరల్లో గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని మరోసారి నొక్కి చెప్పారు. కార్యకర్తలు ఎటువంటి నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతా సైనికుల్లా కలసికట్టుగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో బీజేడీ పార్టీయే స్థిరమైనదన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటుకుంటాం బీజేడీ పార్టీ నేత, మాజీ మంత్రి ప్రమిలా మల్లిక్
నెక్కంటి నేతృత్వంలో పార్టీ బలోపేతం..
సమావేశంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెక్కంటి నేతృత్వంలో బీజేడీ ఈ జిల్లాలో మరింత బలొపేతం అవుతుందన్నారు. త్వరలో ప్రకటించనున్న బీజేడీ జిల్లా అధ్యక్షుడి పదవిని ఆయనకు ఇవ్వాలని కోరారు. పార్టీని ముందుకు నడిపించే సమర్ధమంతమైన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నెక్కంటికి తిరిగి పగ్గాలు చేపట్టే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, అనసూయా మాఝి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక తదితరులు పాల్గొన్నారు.