
వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, సుప్రభాత సేవ, విశేష పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని శ్రీరామా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
20కి రథాల నిర్మాణం
ప్రారంభించాలి
జయపురం: రథయాత్రకు 20వ తేదీలోగా రథ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో రథాల పనులు జరుపుతున్నట్లు దేవాదాయ విభాగం సీనియర్ క్లర్క్ రథయాత్ర పర్యవేక్షకులు కృష్ణ చంద్రదాస్ వెల్లడించారు. జయపురంలో రథ నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. అక్షయ తృతీయ దినాన రథ నిర్మాణానికి పూజలు చేశామని వెల్లడించారు. జయపురం రథం పొడవు 44 అడుగులు ఉంటుందని తెలిపారు. శ్రీజగన్నాథ్, సుభధ్ర, బలభధ్రల దేవతా మూర్తుల కోసం నిర్మిస్తున్న పెద్ద రథంతో పాటు పతిత పావనునికి చిన్నరథం తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే జయపురం సమితి బాట జగన్నాథ్పూర్ గ్రామం రథం కూడా ఇక్కడ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. పలిగుడ వడ్రంగి ధనుర్జయ కమర, పనసపుట్భగర కముల కమరల నేతృత్వంలో మరో ఆరుగురు రథాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎలుగు దాడిలో ఒకరికి
తీవ్ర గాయాలు
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి గుమడ పంచాయతీలో ఒక రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా ఆ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని రాధా చలాన్(60)గా గుర్తించారు. అందిన వివరాల ప్రకారం.. రాథా చలాన్ కొట్పాడ్ సమితి ప్రాంతంలో ఇంద్రావతి నది ప్రాంతంలో మొక్కజొన్న పంట వేశాడు. ప్రతిరోజూ అతడు మొక్క జొన్న పంటకు రాత్రిళ్లు కాపలా కాస్తుంటాడు. గురువారం రాత్రి కూడా తోటకు కాపలా కాశాడు. రాత్రి 4 గంటల సమయంలో అతడు నిద్రిస్తున్న సమయంలో సమీప చెరుకు మడి నుంచి ఒక ఎలుగు బంటి వచ్చి అతడిపై దాడి చేసింది. అతడి తల, ముఖంపై బలమైన గాయాలయ్యాయి. కేకలు విని పక్కన ఉన్న రైతులు రావడంతో వారిని చూసి ఎలుగు పారిపోయింది. తీవ్రంగా గాయపడిన రాధా చలాన్ను వెంటనే జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను కులమతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జిల్లా ప్రజలు జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల వద్ద ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, గోవధ, పశువుల అక్రమ రవాణా చేసే వారి సమాచారాన్ని డయల్ 100, 112లకు, పరిధి పోలీస్స్టేషన్లకు అందించాలన్నారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం