
పట్టు పోగుల తరలింపు
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025
జగన్నాథుని కోసం..
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని అలంకరణ తదితర కార్యక్రమాల్లో వినియోగించే పట్టు పోగుల్ని శ్రీ మందిరానికి తరలించారు. స్థానిక షహీద్ నగర్లోని ఒడిశా సహకార టసర్, రేషమ్ మహాసంఘ్ (సెరిఫెడ్) కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రత్యేక వాహనంలో 350 కిలో గ్రాముల పట్టు పోగుల్ని పూరీ శ్రీ మందిరానికి తరలించారు. ఈ సందర్భంగా వాహన ప్రారంభం ప్రాంగణంలో లాంచనంగా పూజాదులు నిర్వహించారు. ధూపదీపాదులతో మంగళ హారతి సమర్పించి సాగనంపారు. రాష్ట్ర సహకార, చేనేత, హస్తకళల శాఖ మంత్రి ప్రదీప్ బొలొ సామంత జెండాను ఊపి పట్టు పోగుల రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విభాగ అధికారులు భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు.
ఈ పట్టు పోగుల్ని రత్న వేదికపై కొలువు దీరిన బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు, సుదర్శనుని అలంకరణ కోసం వినియోగిస్తారు. రథ యాత్ర, రక్షా బంధన్ ఇతరేతర పండగ పబ్బాలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల్లో వినియోగిస్తారు. శ్రీ మందిరం పాలన వర్గం అభ్యర్థన మేరకు అవసరమైన పట్టు పోగుల్ని రవాణా చేస్తారు. 1981 సంవత్సరం నుండి, సెరిఫెడ్ శ్రీమందిరానికి ఈ పోగుల్ని నిరవధికంగా సరఫరా చేస్తోంది. ఈ ఏడాది 350 కిలోగ్రాముల పట్టు పోగుల్ని తరలించింది. ఈ పట్టు పోగుల్ని మల్బరీ పురుగుల నుంచి తయారు చేస్తారు. దీనిని ప్రధానంగా గజపతి జిల్లాలోని మోహన, ఆర్.ఉదయగిరి మండలాల్లో గిరిజన పట్టు రైతులు ఉత్పత్తి చేస్తారు. కొరాపుట్ జిల్లా నుంచి సేకరించిన కై తా పండ్ల గుజ్జుతో పోగులకు రంగు పూస్తారు.
గిరిజనుల నుంచి సేకరించిన ముడి పట్టు పోగుల్ని కటక్ జిల్లా నువాపట్నా ప్రాంతంలో సిల్క్ ప్రొడక్షన్ – టెక్నికల్ అప్గ్రేడేషన్ సెంటర్లో అవసరానికి అనుగుణంగా పోగుల్ని తయారు చేస్తారు. ఈ పోగులను కేవలం శ్రీ మందిరంలో మూల విరాటుల సేవాదులకు మాత్రమే వినియోగిస్తారు. ఇతరేతర వ్యవహారాలు, ప్రయోజనాలకు ఏమాత్రం వినియోగించరని తెలిపారు.
చేనేత వస్త్రాల శాఖ డైరెక్టర్ ప్రేమచంద్ర చౌదరి, హస్తకళల విభాగం డైరెక్టర్ ప్రణతి ఛొట్రాయ్, సంయుక్త కార్యదర్శి మధుమిత రథ్, సెరిఫెడ్ చైర్పర్సన్ భగీరథి నందా, సెరిఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమాదిత్య బారిక్ ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు.
న్యూస్రీల్

పట్టు పోగుల తరలింపు

పట్టు పోగుల తరలింపు