
ధాన్యం సేకరణపై సమీక్ష
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణను ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో సమీక్షించారు. ఒడిశా రాష్ట్ర సరఫరా కార్పొరేషన్ సమావేశం హాల్ ప్రాంగణంలో అధికారులతో సమావేశమై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహార సరఫరా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సుదర్శన్ చక్రవర్తి ధాన్యం సేకరణ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుత రబీ సీజన్లో రాష్ట్రంలోని దాదాపు 88 వేల మంది రైతుల నుంచి ఇప్పటివరకు దాదాపు 6 లక్షల 6 వేల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. అదనపు సాగు పెట్టుబడి మరియు కనీస మద్దతు ధర కింద రైతాంగం పొదుపు ఖాతాలకు సుమారు రూ.1,566 కోట్లు ప్రత్యక్షంగా బదిలీ చేశారు.
సేకరణ వేగవంతం
రుతు పవనాలు వస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. మండీల్లో రైతులు పోగు చేసిన ధాన్యం రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతుందన్నారు. వరి సేకరణ సమయంలో ఏవైనా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 214 గోడౌన్ల ఆధునీకరణ, సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపట్టారు. దీంతో పాటు కార్పొరేషన్ కొత్త భవనాల నిర్మాణ పురోగతిపై కూడా సమీక్షించారు. సాధారణ పంపిణీ విభాగం జనరల్ మేనేజర్ సుధాకర్ సొబొరొ, ధాన్యం సేకరణ జనరల్ మేనేజర్ ఎలోరా సామల్, పాలనా విభాగం జనరల్ మేనేజర్ ప్రణతి ప్రియదర్శిని రౌత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.