
ఏనుగుల బీభత్సం
రాయగడ: బిసంకటక్ సమితిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కొద్ది రోజులుగా కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు చొరబడి ఎటువంటి ఆపదను తీసుకువస్తాయోనన్న భయంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమితిలోని కుటురిగుడ అడవుల నుంచి ఏనుగులు సరాసరి గ్రామంలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన నారాయణ హుయిక అనే ఆదివాసీ రైతుకు చెందిన పనస, అరటి తొటలను ధ్వంసం చేయడంతోపాటు అతను నివసించే పూరి గుడిసెను సైతం పాడుచేశాయి. ఏనుగుల రాకను గమనించిన హుయిక కుటుంబీకులు అక్కడి నుంచి పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. సమీపంలోని కుంభారోబడి గ్రామానికి వెళ్లి తలదాచుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసిన ఏనుగులు అందులో ఉంచిన ధాన్యం, బియ్యం, చోడి తదితర వస్తువులను నేలపాలు చేశాయి. అలాగే ఇంటి బయట ఉన్న సోలార్ విద్యుత్ దీపాలను కుప్పకూల్చాయి. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానిక చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామార్శించారు. ఏనుగుల వల్ల కలిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. గ్రామస్తులు చెప్పిన ప్రకారం శుక్రవారం రాత్రి సుమారు 24 ఏనుగుల గుంపు ఒక్కసారిగా కుటురిగుడ గ్రామంలోకి చొరబడ్డాయి. వాటిలో కొన్ని అడవిలోనికి తిరిగి వెళ్లిపొగా కొన్ని మాత్రం బీభత్సాన్ని సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఏనుగుల గుంపు కళ్యాణ సింగుపూర్ సమీపంలోని అడవుల్లో ఉండేవని ఆ గుంపే ఇక్కడకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అడవులు అంతరిస్తుండటంతో ఏనుగులు తినేందుకు ఎటువంటి ఆహారం లభించకపొవడంతో ఆహారాన్ని వెతుకుంటూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి బారినుంచి గ్రామస్తులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
పంటలు ధ్వంసం

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం