
రథాల పై అంతస్తు తయారీ ప్రారంభం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మధ్యంతర దశలో కలప దుంగలు తయారీ శాలకు చేరడంలో కొంత మేరకు ఆలస్యం జరిగినా తర్వాత పనులు ఊపందుకున్నాయి. సాధారణంగా స్వామి స్నానోత్సవం నాటికి పూర్తి కావాల్సిన రథాల పై అంతస్తు తయారీ పనులు దాదాపు 2 రోజులు ముందుగా పూర్తి కానున్నాయి. రథ చక్రాలకు ఇరుసుల అమరిక పూర్తయిన నాటికి పై అంతస్తు పనులు ఆరంభమై ముందస్తుగా సిద్ధమయ్యాయి. ఇరుసు, చక్రాల ఆధారంగా నిర్మితం అవుతున్న పై అంతస్తు భాగంపై భారీ రథం ప్రధాన భాగం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో దీని తయారీ అమరిక అత్యంత కీలకమని వడ్రంగి సేవకులు తెలిపారు.
అనిమేష్ కుజుర్కు సీఎం అభినందనలు
భువనేశ్వర్: తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2025లో పురుషుల 400 మీటర్ల రిలేలో ఒడిశాకు చెందిన అనిమేష్ కుజుర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. భారత జట్టులో గుర్విందర్ సింగ్, అనిమేష్ కుజుర్, అమ్లాన్ బోర్గోహైన్ మరియు మణికంఠ హోబ్లిదార్ ఉన్నారు. భారత జట్టుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందనలు తెలిపారు. ఈ జట్టులో భాగమైన యువ ఒడిశా రన్నర్ అనిమేష్ కుజుర్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మజ్జిగౌరి మందిరానికి
పోటెత్తిన భక్తులు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి క్యూలో వేచిఉండాల్సి వచ్చింది. అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలియజేశారు. అయితే వీఐపీ దర్శనం టిక్కెట్లు రూ.300 చెల్లించి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు తిప్పలు తప్పలేదు. దీంతో విసుగెత్తిన భక్తులు కొంతమంది ఆరు బయటే అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి ఇంటికి తిరిగి వెళ్లారు.
రథయాత్రకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ: ఆరోగ్య శాఖ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతోంది. మరో వైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పుంజుకుంటోంది. కరోనా సంక్రమణ నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరుకుంది. ప్రస్తుతం 7 మంది కోలుకోవడంతో 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ పాజిటివ్ రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది జరగనున్న రథయాత్ర కోసం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ 19 లక్షణాలతో అనారోగ్య పరిస్థితి ఉంటే రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నీలకంఠ మిశ్రా ప్రజలను కోరారు.
కోవిడ్ ఆంక్షలు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.అశ్వత్థి రథ యాత్రలో కోవిడ్ జాగ్రత్తల ఆచరణ, నివారణ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. జలుబు, ఫ్లూ వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులు లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు స్వామి యాత్రలో రథం లాగేందుకు అనుమతించరు. అదే విధంగా ఇతర తీవ్రమైన వ్యాధుల కారణంగా బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారిని ఉత్సవాలకు హాజరు కావద్దని కోరారు. యాత్రలో పాల్గొనదలిచే వారు మాస్క్లు ధరించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ తెలిపింది. శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలని కోరారు. పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు) పనిచేస్తుంది. పడకల సంఖ్యను పెంచుతారు. అంబులెన్స్ సౌకర్యాలు, ఆరోగ్య అధికారులతో పాటు అన్ని అనుబంధ వైద్య, చికిత్స సరంజామా అందుబాటులో ఉంచుతారు.

రథాల పై అంతస్తు తయారీ ప్రారంభం