
ఉత్సాహంగా కంచమ్మ తల్లి సంబరాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో నిర్వహిస్తున్న కంచమ్మ తల్లి గ్రామదేవత సంబర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజైన సోమవారం కూడా అమ్మవారిని సాయంత్రం తిరువీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని పీఠస్థానం నుంచి మఠం కంచిలి తీసుకొచ్చి, అక్కడి నుంచి మెయిన్రోడ్డు మీదుగా జాతీయ రహదారి కూడలి వరకు ఊరేగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన వరకు జబర్దస్త్, ఢీ డ్యాన్స్ టీం యాక్టర్స్ అలరించారు.
శ్రీముఖలింగంలో
పండిత సదస్యం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ట మాసం నాల్గో రోజు సోమవారం అంకురార్పణ, హోమం, పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు నిర్వహించారు. దీనికి ముందు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వారాహి అమ్మవారికి మహిళలు ఘనంగా పూజలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
కవిటి: ఇచ్ఛాపురం పట్టణం ఉప్పలవీధికి చెందిన గేదెల నాగరాజు(32) అనే వ్యక్తి ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందా డు. ఘటనకు సంబంధించి కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కంచిలిలో జరుగుతున్న అమ్మవారి పండుగల కోసం నాగరాజు మధ్యాహ్నం 1 గంటకు ఇచ్ఛాపురం నుంచి కంచిలి చేరుకున్నాడు. అక్కడ రోజంతా ఉండి రాత్రి 8 గంటలకు సొంతూరు ఇచ్ఛాపురానికి బయలుదేరాడు. ఈ తిరుగు ప్రయాణంలో కవిటి మండలం జాతీయ రహదారిలో సర్పంచ్ దాబా దాటిన తర్వాత జమేదారుపుట్టుగ జంక్షన్కు చేరుకునే సమయానికి బండి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు ఘటన స్థలానికి వేకువజామున చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు.
‘జిల్లా అభివృద్ధికి కార్యాచరణ’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి స్పష్టమైన దిశ, కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు సోమవారం విజయవాడలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన చర్చలో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి మాట్లాడారు.
కేంద్రాస్పత్రిలో పనిచేయని లిఫ్ట్
టెక్కలిరూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో లిఫ్ట్ మూడు రోజులుగా పనిచేయడం లేదు. పై ఫ్లోర్లో డయాలసిస్ కేంద్రం ఉండడంతో మెట్లు ఎక్కి వెళ్లలేక కిడ్నీ వ్యాధి బాధితులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. మూడు రోజులవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తక్షణం మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

ఉత్సాహంగా కంచమ్మ తల్లి సంబరాలు