
శ్రీమందిరంలో డిజిటల్ హుండీకి సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయానికి విరాళాల ప్రక్రియను ఆధునీకరించేందుకు అనుబంధ యంత్రాంగం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో సమర్పణ అనే డిజిటల్ హుండీ వ్యవస్థను ప్రారంభించాలని సంకల్పించింది. దేశ వ్యాప్తంగా బహుళ బ్యాంకు శాఖలలో ఈ వ్యవస్థని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశాల మేరకు న్యాయ శాఖ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నాహాల్లో శ్రీ మందిరం పాలక మండలి సభ్యులు చురుకుగా పాలుపంచుకుంటున్నారు. ఆన్లైన్ విరాళాల ప్రక్రియను క్రమబద్ధీకరించి సరళీకృతం చేసేందుకు సమర్పణ డిజిటల్ చొరవ దోహదపడుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా భక్తులు ఎక్కడి నుండైనా ఆలయానికి విరాళాలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ప్రత్యేక డిజిటల్ హుండీలను ఏర్పాటు చేస్తారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్లైన్ విరాళాలు చెల్లించేందుకు వీలు అవుతుంది.
భక్తులకు సౌకర్యం
డిజిటల్ హుండీలను ప్రారంభించడానికి వివిధ బ్యాంకుల చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్లతో (సీఎండీలు) చర్చలు ప్రారంభించారు. భక్తులు యూపీఐ కోడ్లను స్కాన్ చేసి, వారి కానుకలను నేరుగా జగన్నాథ ఆలయ ఖాతాకు చెల్లించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ డిజిటల్ విధానం పారదర్శకతను పెంపొందించి రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న భక్తులు మతపరమైన వేడుకలు మరియు ఉత్సవాలు, యాత్రలు వంటి సందర్భాల్లో విరాళాలు ఇవ్వడానికి అనుకూలమైన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు.
భద్రతా సమస్యల ప్రస్తావన
మరోవైపు కొంతమంది మాజీ బ్యాంకర్లు నకిలీ స్కానింగ్ పరికరాలను ఉపయోగించి సైబర్ స్కామ్లు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు, దీనితో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. సమర్పణ్ చొరవ జాతీయ, అంతర్జాతీయ భక్తులు జగన్నాథుడికి తమ విరాళాలను అందించడానికి ప్రధాన వారధిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మాజీ బ్యాంకర్ల సూచన మేరకు క్యూఆర్ కోడ్లో కొన్ని భద్రతా చర్యలు తీసుకోవడం అనివార్యంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర న్యాయ శాఖ, సాంకేతిక సమాచార విభాగం సమన్వయంతో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి వివిధ భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు. గత మూడేళ్లలో శ్రీ మందిరానికి దాదాపు రూ. 113 కోట్ల విరాళాలు అందాయి. వాటిలో రూ. 59.67 కోట్లు బ్యాంకు డిపాజిట్ల ద్వారా జమ అయ్యాయి. ప్రతిపాదిత డిజిటల్ హుండీ వ్యవస్థ ఆన్లైన్ విరాళాలను గణనీయంగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.