
దారిలో ప్రసవం
డోలీలో ప్రయాణం..
జయపురం: డోలీలో ఓ గర్భిణిని మోసుకు వెళ్తుండగా దారిలో ప్రసవమైన ఘటన జయపురం సమితి రొండాపల్లి పంచాయతీ రామగడ గ్రామ సమీపంలో జరిగింది. ఆమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కొండపై గల కెందుగుడ గ్రామంలో గురువారీ పొరజ నివాసం ఉంటున్నారు. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ వర్కర్కు చెప్పడంతో ఆమె అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి మార్గం లేక అంబులెన్స్ రాదని డ్రైవర్ తెలపటంతో గ్రామ ప్రజలు వెదురు బుంగలతో ఒక డోలీ కట్టి అందులో గర్భిణిని ఉంచి రెండు పర్వతాలు దాటించారు. ఆస్పత్రి మరో 3 కిలోమీటర్లు ఉందనగా.. గురువారీ పొరజకు ప్రసవమైంది. విషయం ఆశ వర్కర్ స్వర్ణలతకు తెలియజేసి తల్లీబిడ్డలను ఇంటికి తీసుకు వెలుతున్నట్లు తెలియజేశారు. స్వర్ణలత బైరాగి మఠం వద్ద వేచి ఉంది. అక్కడకు వచ్చిన బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పినా వారు వినలేదు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఇలా డోలీలు, మంచాలపై రోగులను మోసుకుంటూ వెళ్లాల్సి వస్తోందని, రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు.