కొరాపుట్: నిర్మితమవుతున్న సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు నలుగురు యువకులు మంగళవారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నందాహండి సమితి పడాల్గుడ గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మితం అవుతోంది. అందులో దిగిన ముగ్గురు కార్మికులు అమిర్ కొర (30), త్రిలోచన్ బోత్ర (25), లలూ రణ (26)లు అక్కడికక్కడే అచేతన స్థితికి గురయ్యారు. ఇది గమనించిన మిగతా కార్మికులు భయాందోళనతో కేకలు వేశారు. ఇది తెలుసుకున్న స్థానిక వ్యాపారస్తుడు ఎన్.సంతు (28) వారిని రక్షించడానికి లోపలకి దిగగా అతను కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మరెవ్వరూ లోపలకి దిగడానికి సాహసం చేయలేకపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి నలుగురిని బయటకు తీశారు. వీరిని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సంతుని ఐసీయూలోనికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను కూడా మృతి చెందాడు. ఈ వార్త జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి స్పందిస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతి చెందిన ప్రతీ కుటుంబంకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు స్పందిస్తూ మృతులకు సంతాపం ప్రకటించారు.
సెప్టిక్ ట్యాంక్లో పడి నలుగురు మృతి
సెప్టిక్ ట్యాంక్లో పడి నలుగురు మృతి