
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..!
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
అల్పపీడనం ప్రభావంతో...
బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రుతు పవనాలు ఒడిశా ప్రాంతానికి సాధారణం కంటే వారం ముందుగానే ప్రవేశించాయి. అయితే తదుపరి పురోగతి లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రొజ్జొ పండుగ వరకు రాష్ట్రవ్యాప్తంగా రుతు పవనాల కదలికలు లేకపోయే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రుతు పవనాలు తాత్కాలికంగా విరామం పొందినట్లేనని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొదట్లో చెల్లాచెదురుగా వర్షాలు కురిపించిన రుతుపవనాల ముందస్తు తిరోగమనం ఈ పరిస్థితికి కారణమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు భువనేశ్వర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. 67.2 శాతం తేమ స్థాయి కారణంగా నగరంలో తీవ్రమైన ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాష్ట్రస్థాయిలో బాలాసోర్లో అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తదుపరి స్థానాల్లో పూరీలో 34.6 డిగ్రీల సెల్సియస్, చాంద్బాలిలో 33.4 డిగ్రీల సెల్సియస్, పారాదీప్లో 32.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.
భువనేశ్వర్: రాష్ట్రంలో రుతు పవనాలు ఊరించి ఊరుకున్నాయి. వారం రోజులు ముందుగానే ఈ ఏడాది రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ఆనందం వెంటనే ఆవిరైపోయింది. ప్రస్తుతం రుతు పవనాల కదలిక మందగించడంతో అధిక ఉష్టోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పులతో రుతు పవనాల కదలిక బలహీన పడిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈనెల మధ్యకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాజా వాతావరణ సూచన జారీ అయింది. జూన్ మధ్య వరకు రాష్ట్రంలో రుతు పవనాలు పుంజుకునే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనా. రాష్ట్ర వాతావరణంలో ఉష్ణోగ్రత మరియు తేమ స్థాయిలు స్థిరంగా కొనసాగనున్నాయి.
మారుమూల ప్రాంతాల్లో వర్షాలు
తీరప్రాంత ఒడిశాలో తీవ్రమైన వేడి కొనసాగుతుండగా మల్కన్గిరి, కొరాపుట్, రాయగడ, కెంజొహర్, సుందర్గఢ్ వంటి అంతర్గత జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిపించే కాల వైశాఖి వాతావరణం అలముకుని ఉంది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక ఉపశమనం లభిస్తోంది. కాగా పూరీ, ఖుర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా, జాజ్పూర్, భద్రక్, బాలాసోర్, గంజాం, గజపతి మరియు నయాగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ వడగాడ్పుల హెచ్చరిక జారీ చేసింది. ఈ జిల్లాల్లో వేడి మరియు తేమతో కూడిన ఉక్కపోత పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఈనెల 6వ తేదీ వరకు 11 తీరప్రాంత జిల్లాల్లో వడగాడ్పుల వాతావరణం నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ ఉంది. గత నెల 31 నుంచి రాష్ట్రంలో రుతుపవన వర్షాలు తగ్గాయి.
న్యూస్రీల్
ఊరించి ఊరుకున్న రుతు పవనాలు
అమాంతం పెరిగిన ఉష్టోగ్రతలు
అల్లాడుతున్న ప్రజలు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..!