
సిక్కిం తీస్తా నదిలో బస్సు బోల్తా
భువనేశ్వర్: సిక్కింలోని తీస్తా నదిలో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఒడిశాలోని జాజ్పూర్ రోడ్ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఇతిశ్రీ జెనా కుటుంబ సభ్యులు ఉన్నారు. పర్యాటకుల్లో అత్యధికులు ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందినవారని సమాచారం. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ బస్సు 11 మంది వ్యక్తులతో (10 మంది పర్యాటకులు మరియు ఒక డ్రైవర్) ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కొండ రోడ్డు నుంచి జారిపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. సిక్కిం రాజధాని నగరం గ్యాంగ్టక్ నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా ఈ దురదృష్టకర సంఘటన సంభవించింది. మంగన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సోనమ్ దేచు భూటియా సమాచారం ప్రకారం ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారిని రక్షించారు. గాయపడిన వారిని మంగన్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు.
సీఎం మాఝీ జోక్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సిక్కిం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన అన్ని వనరులను సమీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో ఫోన్లో సంప్రదించారు. అదనంగా అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒడిశా నుంచి ఒక ప్రత్యేక సహాయ బృందాన్ని పంపించారు. బాధితులకు తక్షణ చికిత్స, వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గల్లంతైన వారిలో 6 మంది ఒడియా వ్యక్తులు ఉన్నట్లు భోగట్టా. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి ఇతిశ్రీ జెనా కుటుంబీకులు, బంధువులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఆదివారం జాజ్పూర్ రోడ్ నుండి రైలులో ప్రయాణించారు. గాంగ్టక్ 1000 అడుగుల ఎత్తున ఉన్న ఒక ప్రదేశం సందర్శించి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుందని ఆమె బంధువు తెలిపారు. వీరంతా 2 వేర్వేరు వాహనాల్లో సర్దుకుని తిరిగి వస్తుండగా ఒక వాహనంలో నదిలోకి జారింది. ఇతిశ్రీ జెనా ఆమె కుమారుడు మరో 2 మంది బంధువులతో కలిసి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వారిలో ఇద్దరు పిల్లల జాడ గుర్తించారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి జాడ ఇంత వరకు లభ్యం కాలేదని బంధువు వాపోయాడు.
ఈ విషాదకరమైన ప్రమాదం పట్ల ఓలీవుడ్ నటుడు, కొరై నియోజక వర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతిశ్రీ జెనా తన కుటుంబంతో కలిసి సిక్కింలోని గ్యాంగ్టక్కు విహారయాత్రకు వెళ్లారు. వారు రెండు వాహనాల్లో వెళ్లారు. ఒక వాహనం నదిలో పడిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న కుటుంబీకులు గల్లంతు అయ్యారు. అదృష్టవశాత్తూ ఇద్దరు చిన్న పిల్లలకు పెను గండం తప్పింది. గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సిక్కిం ముఖ్యమంత్రితో సంప్రదిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఒకరు మృతి, 8 మంది గల్లంతు
బాధితుల్లో ఒడిశా వాసులే అధికం

సిక్కిం తీస్తా నదిలో బస్సు బోల్తా