
అథ్లెట్లకు అభినందనలు
భువనేశ్వర్: దక్షిణ కొరియా గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు విశేష ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారు. ఏస్ స్ప్రింటర్ అనిమేష్ కుజుర్, శ్రావణి నొందొ ఈ పోటీలో పతకాలు సాధించారు. అనిమేష్ కుజుర్ పురుషుల 200 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతి స్వల్పంగా 20.32 సెకన్ల సమయంతో గమ్యం ఛేదించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. గుమిలో జరిగిన తన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో అనిమేష్ కుజుర్ తొలిసారి పాల్గొని కాంస్య పతకం సాధించడం విశేషం. ఫుట్బాల్ క్రీడాకారుడి నుంచి ఏస్ స్ప్రింటర్గా ఆవిర్భవించి తనదైన శైలిలో అద్భుత ప్రతిభ ప్రదర్శించాడని అతని కోచ్ మార్టిన్ ఓవెన్స్ కొనియాడారు. ఒడిశా స్టార్ స్ప్రింటర్ శ్రావణి నొందొతో కూడిన భారత మహిళల రిలే జట్టు 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2025లో 400 మీటర్ల ఈవెంట్లో 43.86 సెకన్ల సమయంతో లక్ష్యం ఛేదించి రజత పతకాన్ని సాధించింది. శ్రబాణి, ఎస్. ఎస్. స్నేహ, అభినయ రాజరాజన్, నిత్య గాంధేలతో కూడిన జట్టులో శ్రావణి నొందొ ఒకరుగా పాల్గొని విజయం సాధించింది. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించిన శ్రావణి నొందొ, కాంస్య పతకం గెలుచుకున్న అనిమేష్ కుజుర్కు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందనలు తెలిపారు.

అథ్లెట్లకు అభినందనలు