
ఒడిశా తొలి బీజేపీ ఎమ్మెల్యే ప్రసన్న పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రసన్న పట్నాయక్ (74) శుక్రవారం శాశ్వతంగా కన్నుమూశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన కామాఖ్యనగర్ నియోజక వర్గం నుంచి తొలి బీజేపీ అభ్యర్థిగా శాసన సభకు ప్రాతినిథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన యుగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా ప్రత్యేక ఉనికిని చాటుకున్నారు.
1977లో జనతా పార్టీ అభ్యర్థిగా శాసన సభ్యుడిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 1985లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర శాసన సభలో కామాఖ్య నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ విజయంతో ఆయన రాష్ట్ర శాసన సభలో తొలి బీజేపీ ఎమ్మెల్యేగా చరిత్ర ఆవిష్కరించారు. ఆ తర్వాత బీజేపీకి గుడ్బై పలికి 1990లో బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి కామాఖ్యనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై విజేతగా నిలిచారు. ఈ లెక్కన ఆయన కామాఖ్యనగర్ నియోజక వర్గం నుంచి శాసన సభకు 3 సార్లు ఎన్నిక కావడం విశేషం. ఆయన పదవీకాలంలో తన నియోజక వర్గంలో అత్యధికంగా 15 విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఆయన మృతికి రాష్ట్ర ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసన్న పట్నాయక్ ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని కొనియాడారు. అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన మరణం రాష్ట్ర రాజకీయ రంగంలో భర్తీ కాలేని శూన్యంగా మిగిలిపోతుందని విచారం వ్యక్తం చేశారు.
అంతిమ వీడ్కోలు
దివంగత ఎమ్మెల్యే ప్రసన్న పట్నాయక్ పార్థివ దేహం రాష్ట్ర శాసన సభ ఆవరణకు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి మరి కొంత మంది శాసన సభ సభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించి అంతిమ వీడ్కోలు పలికారు. తదుపరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలకు దివంగత నాయకుని పార్థివ దేహం తరలించారు. కార్యాలయం ప్రాంగణంలో పలువురు పార్టీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంత్యక్రియలు పూరీ స్వర్గద్వార్ స్మశాన వాటికలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యుల సమాచారం.

ఒడిశా తొలి బీజేపీ ఎమ్మెల్యే ప్రసన్న పట్నాయక్ కన్నుమూత