
దిఘా జగన్నాథ ఆలయ వివాదం తీవ్రతరం
● అంతర్గత దర్యాప్తునకు ఆదేశాలు
భువనేశ్వర్: పశ్చిమబెంగాల్లోని దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రతిష్ట మహోత్సవం వివాదస్పదమై తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందించారు. ఈ వివాదం కోణంలో అంతర్గత దర్యాప్తు జరపాలని పూరీ శ్రీజగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి(సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢికి మంత్రి లేఖ రాశారు. ఈ లేఖలో దర్యాప్తు జరపాల్సిన సమస్యాత్మక అంశాల్ని స్పష్టం చేశారు. దిఘా ఆలయానికి జగన్నాథ ధామ్ అని పేరు పెట్టడం అత్యంత వివాదస్పదం అయింది. దేశంలో సమగ్రంగా చతుర్థామాలు ఉన్నాయి. వీటిలో పూరీ ఒకటిగా స్థానం సాధించింది. ఈ పరిస్థితుల్లో దిఘా జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడంతో రచ్చ రగులుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పూరీ శ్రీమందిరం నుంచి సేవాయత్లు దిఘా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం వివాదాన్ని మరింత రగిల్చింది. మరోవైపు దిఘా ఆలయంలో దేవతల విగ్రహాలను నిర్మించడానికి శ్రీమందిరంలో దారు విగ్రహాల తయారీ తర్వాత మిగిలిన పవిత్ర కలప ఉపయోగించినట్లు ప్రసారమైన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దిఘా జగన్నాథ ఆలయాన్ని ఏప్రిల్ 30న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ చర్యలు జగన్నాథ స్వామి భక్తులు మరియు ఒడిశాలోని నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అంతర్గత దర్యాప్తు చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తీసుకు రావాల్సి ఉందని మంత్రి శ్రీమందిరం సీఏఓకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.