
42 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురి అరెస్టు
రాయగడ: జిల్లాలోని రామనగుడ పోలీసులు శనివారం నిర్వహించిన దాడుల్లో 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలో మిచికిలింగి గ్రామానికి చెందిన బాసుదేవ్ బిడిక, అజయ్ కడ్రక, మహారాష్ట్రకు చెందిన తుషార్ దీపక్ ఒఘాడేతో సహా మరో మైనర్ బాలుడు ఉన్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పెనకాం పంచాయతీలోని తమింగి గ్రామం సమీపంలో నలుగురు వ్యక్తులు రెండు బస్తాలు మోసుకుంటూ వెళుతుండగా వారిని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు.
ఆంధ్రా పేకాటరాయుళ్లు అరెస్టు
కొరాపుట్: ఒడిశాలో ఆంధ్రా పేకాట రాయుళ్లు అరెస్టయ్యారు. ఆదివారం కొరాపుట్ జిల్లా బంధుగాం సమితి అలమండ గ్రామ సమీపంలో చీడి వలస అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట జరుగుతున్నట్లు లక్ష్మీపూర్ ఎస్డీపీఓ బిరంచి నారాయణ్ జగత్కి సమాచారం వచ్చింది. వెంటనే బందుగాం పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్ట్ చేసి బందుగాం పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరి నుంచి రెండు కార్లు, 14 సెల్ ఫోన్లు, 10 బైక్లు, రూ.75 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వాసులుగా గుర్తించారు.
206 మందికి వైద్య సేవలు
రాయగడ: స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కొలనార సమితి దొందిలి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణుడు ఎం.సురేష్ కుమార్, వైద్యులు జి.వి.రమణ, లోక్నాథ్ రాజు, సౌమ్య రంజన్ నాయక్, హిరాచంద్ పట్నాయక్, మధుస్మిత జైన్, ఫార్మాసిస్టులు ఎ.మురళీ ధర్ బెహర, ప్రమోద్ కుమార్ సాహు, మినకేతన్ కొండగిరి, తదితరులు పాల్గొన్నారు. దొందిలి పరిసర గ్రామాలకు చెందిన 206 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందించారు. ఇందులో 26 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ల కోసంసం పితామహాల్ వద్ద గల ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించినట్లు శిబిరం నిర్వాహకులు డాక్టర్ ఎల్.ఎన్.సాహు తెలియజేశారు.
జోషితకు డీఈఓ అభినందనలు
మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జోషితను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచిందని అన్నారు. తల్లిదండ్రులు లేపాక్షి, మాధవరావులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా జోషితకు రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. విజయానికి కారణమైన హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.
భావనపాడు తీరం సందర్శన
సంతబొమ్మాళి: భావనపాడు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 420 తాబే లు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. కార్యక్రమంలో భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్రెడ్డి, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి నరేంద్ర, బీట్ అధికారి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

42 కిలోల గంజాయి స్వాధీనం

42 కిలోల గంజాయి స్వాధీనం

42 కిలోల గంజాయి స్వాధీనం