20 కేజీల గంజాయి పట్టివేత నిందితులకు ఈనెల 17 వరకు రిమాండ్
కంచికచర్ల: గంజాయి, మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు విక్రయించినా లేక తీసుకున్నా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని కంచికచర్ల సీఐ డి.చవాన్ హెచ్చరించారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల శివారు మద్దులమ్మ తల్లి ఆలయానికి వెళ్లే తోళ్లవాగు వద్ద కొంతమంది యువకులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ చవాన్ మాట్లాడుతూ కంచికచర్ల తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది యువకులు సీలేరు ప్రాంతం నుంచి 20 కేజీల గంజాయి తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందని, ఆ సమాచారం మేరకు కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పి.విశ్వనాథ్, అభిమన్యులతో పాటు డెప్యూటీ తహసీల్దార్ వి.మానస, వీఆర్వోలతో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న 9 మంది యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని నందిగామ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి ఈనెల 17 వరకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
గంజాయి విక్రేతల పేర్లు...
గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వారిలో కంచికచర్ల ఇందిరాకాలనీకి చెందిన మేచర్ల శ్రీనివాస్, సత్రం స్కూల్ సమీపంలో ఉన్న మేచర్ల రాహుల్ కార్తికేయ, ఇందిరాకాలనీకి చెందిన అలుగుల తరుణ్, గద్దల కిరణ్కుమార్, గేరె విష్టు, గోగినేని శ్యాం సుందర్, ఆళ్ల వెంకటేశ్వర్లు, మేచర్ల మహేష్ ఉన్నారని సీఐ తెలిపారు.
కాచవరంలో 6 కిలోల గంజాయి స్వాధీనం
కాచవరం(ఇబ్రహీంపట్నం): కాచవరంలోని గ్రీన్ స్టార్ హౌసింగ్ వెంచర్లో సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యం, సెక్టార్ ఎస్ఐ రాజు పాత నేరస్తులపై దృష్టి పెట్టారు. వారికి అందిన సమాచారం మేరకు కాచవరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొల్లి నవీన్ కుమార్ వత్సవాయి మండలం, (ప్రస్తుతం కాచవరం), కొంక సురేంద్ర మూలపాడు, మరో మైనర్ బాలుడు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి సుమారు ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


