ప్రభుత్వం తొండి..
నిర్వీర్యమే లక్ష్యం
ప్రభుత్వ చర్యలతోపేదలకు అందని ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పథకం పేరు వినిపించకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం అందులో భాగంగా ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకుండా మొండిచేయి ఏప్రిల్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో కొత్త పథకం కొత్త పథకం ప్యాకేజీలపై అభ్యంతరం తెలుపుతున్న ఆస్పత్రులు
ఆరోగ్య శ్రీని కొనసాగించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆరోగ్యశ్రీ అంటేనే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఎందరో పేదల ప్రాణాలకు ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల మదిలో నుంచి తుడిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చింది. అయినా ప్రజలతో పాటు వైద్యులు కూడా ఆరోగ్య శ్రీ అనే పిలుస్తున్నారు. దీంతో పథకాన్ని కనుమరుగు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్య శ్రీని రద్దు చేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను ముందుకు తెస్తోంది. వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఆ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆ పథకంలోని ప్యాకేజీలపై ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది.
పేరుకుపోయిన బకాయిలు
చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శ్రీ పథకంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేసే నెట్వర్క్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో 2024లో మొదటి రెండు క్వార్టర్లకు సంబంధించి బిల్లులు రూ.1600 కోట్లు వరకూ పెండింగ్ ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం కనికరించలేదు. అంతేకాదు ఆ తర్వాత చేసిన వాటికి సైతం అరకొరగా నిధులు విడుదల చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీంతో ఉమ్మడి కృష్ణాలోని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.300 కోట్లకు చేరాయి. దీంతో ఆస్పత్రుల మనుగడ కష్టతరంగా మారింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని ఆర్థిక సంక్షో భంలో పలు ఆస్పత్రులు కొట్టుమిట్టాడుతున్నాయి.
తెరపైకి కొత్త పథకం
ఆరోగ్య శ్రీని రద్దు చేసి, యూనివర్సిల్ హెల్త్ స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఈ స్కీమ్లో ఆరోగ్య శ్రీ పథకంలో ఉన్న ప్రొసీజర్ ప్యాకేజీలను వర్తింపజేస్తామని చెప్పడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. తమతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశ పెడితే అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నాయి.
పేదల వైద్యానికీ ఇబ్బందులే..
ఆరోగ్య శ్రీ నిధులు విడుదలలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో ఇప్పటికే సగానికి పైగా ఆస్పత్రులు సేవలు నిలిపివేశాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో కొత్త స్కీమ్ తీసుకొచ్చి, దానిని ఆస్ప త్రులు వ్యతిరేకిస్తే పేదల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తమ పాలిట సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీని రాజకీయాల కోసం రద్దు చేయడంపై పేదలు మండిపడుతున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13.50 లక్షల ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నాయి. వారందరికీ గత ప్రభుత్వం రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించింది. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో సైతం వైద్య సేవలు పొందే వెసులుబాటు కల్పించింది. ఎన్టీఆర్ జిల్లాలో 90, కృష్ణాజిల్లాలో 70 వరకూ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో దాదాపు 120 మందికి పైగా ఆరోగ్య మిత్రలు, ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో పథకం పెట్టిన 2008 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నాయి. ఇప్పుడు పథకాన్ని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టడం దుర్మార్గం. ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వక పోవడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఫలితంగా పలు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కింద సేవలను నిలిిపివేశాయి. ఉచిత వైద్యం అందక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు హర్షించరని తెలుసుకోవాలి.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం
ప్రభుత్వం తొండి..
ప్రభుత్వం తొండి..


