ఉన్నతమైంది న్యాయవాద వృత్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైందని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ అన్నారు. సూర్యారావుపేటలోని రైల్వే ఫంక్షన్ హాలులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యాన కృష్ణాజిల్లా 12వ, విజయవాడ నగర 13వ కాన్ఫరెన్స్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ దుర్గాప్రసాద్ ‘రాజ్యాంగ హక్కులకు రక్షణ – న్యాయవాదుల పాత్ర’ అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చట్టం లేకపోతే అరాచకత్వం పేట్రేగిపోతుందని, దానిని కట్టడి చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఐఏఎల్ స్థాపించిన నాటి నుంచి ప్రజల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తున్నామన్నారు. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, పరీక్షలు నిర్వహించి వారిని చైతన్యం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపాల్ దివాకర్బాబు, యూనియన్ నాయకులు సురేష్ కుమార్, సుధాకర్ రాజు, అన్నారావు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
జస్టిస్ యు.దుర్గాప్రసాద్


