కూటమి కుట్రలు బట్టబయలు
● మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిట్ నివేదికతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
● జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎసా్స్ర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ కింద గల స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ హఫీజ్ నుషా, జిల్లా ఉపాధ్యక్షుడు చింతకుంట్ల వెంకటరెడ్డి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, నాయకులు కాటేపల్లి రవికుమార్, పటాస్ ఫిరోజ్ ఖాన్, గూడపాటి శేషగిరి, బూడిద నరసింహారావు, కన్నమాల శామ్యూల్, మాతంగి నాగబాబు, దర్శనాల వెంకటరమణ పాల్గొన్నారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి కూటమి నేతలు ఘోర అపచారానికి పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, త్రివేణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టి నగర్ లోని పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట టెంకాయలు కొట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు , పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
● తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు వెంకటాచల స్వామి ఆలయంలో శనివారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి స్వామి దాసు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి, తిరువూరు జెడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డి, నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
● నందిగామ నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లగిరి గట్టుపై ఉన్న కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మెట్ల మార్గం ద్వారా స్వామి వారి సన్నిధికి చేరుకుని వంద టెంకాయలు కొట్టారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, మంచాల చంద్రశేఖర్, బండి మల్లికార్జునరావు, ఆవుల రమేష్బాబు, కందుల నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కోటేరు ముత్తారెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు
తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలి
వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శనివారం విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. రాజకీయాల కోసం దేవ దేవుడిని కూడా వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని సీబీఐ ఏర్పాటుచేసిన సిట్ తన చార్జిషీట్లో పేర్కొన్న నేపథ్యంలో కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ప్రజల వద్దకు వచ్చి చెంపలు వేసుకుని గుంజీలు తీసి క్షమాపణ కోరాలన్నారు. పవన్ కళ్యాణ్కు హిందుత్వంపై నమ్మకం ఉంటే చేసిన తప్పు సరిదిద్దుకోవాలని, దుర్గగుడికి వచ్చి తిరిగి మెట్లు కడిగి సంప్రోక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలకుమారి, వియ్యపు అమర్నాథ్, పుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి కుయుక్తులన్నీ సుప్రీంకోర్టులో సిట్ చార్జిషీట్తో బట్టబయలు అయ్యాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషప్రచారం చేయడంతో గోబెల్ను మించిపోయిన చంద్రబాబు, పచ్చకూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి దేవుడిని కూడా వాడుకునే స్థితికి రాజకీయాల్ని దిగజార్చారంటూ సామాన్య భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు శనివారం ప్రత్యేక పూజలు చేసి కూటమి నాయకులకు ఇకనైనా సద్బుద్ధి కలిగేలా చూడాలని ఆ దేవదేవుని ప్రార్థించారు.