సంపూర్ణ అభియాన్ 2.0 రెండో దశ ప్రారంభం
ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షిత బ్లాకు అయిన ఇబ్రహీంపట్నంలో సంపూర్ణతా అభియాన్ 2.0 రెండో దశ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆకాంక్షిత బ్లాకులు అయిన పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నంలో సంపూర్ణతా అభియాన్ తొలిదశలో ఆరు ముఖ్య సూచికల్లో 100 శాతం ప్రగతి సాధించామని, ఇప్పుడు మరో ఆరు కీలక సూచికల్లో 100 శాతం లక్ష్యాల సాధనకు రెండోదశ ప్రారంభించామన్నారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారం, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి అంశాలపై 100 శాతం లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పశువులకు మెరుగైన వైద్యం, ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని 40 సూచికల్లో పూర్తి ఫలితాలు సాధించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంపూర్ణతా అభియాన్ పోస్టర్లు, లోగో ఆవిష్కరించారు. ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, ఆర్డీఓ కావూరి చైతన్య, డీఈఓ ఎల్.చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు.


