భవానీ.. శరణు శరణు | - | Sakshi
Sakshi News home page

భవానీ.. శరణు శరణు

Dec 14 2025 12:15 PM | Updated on Dec 14 2025 12:15 PM

భవానీ

భవానీ.. శరణు శరణు

● భవానీ దీక్షల విరమణకు తరలివస్తున్న భక్తులు ● ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి పరిసరాలు ● శనివారం లక్ష మంది దీక్షల విరమణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు తరలివస్తున్నారు. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. మూడో రోజైన శనివారం లక్ష మంది మాలవిరమణ చేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండు గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. శనివారం వేకువ జాము రెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆలయానికి భవానీలు భారీగా తరలివచ్చారు. వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు కిటకిటలాడాయి.

పగటి వేళ కంటే సాయంత్రమే అధికం

గిరిప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలోనే భవానీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దీక్షల విరమణకు వస్తున్న భవానీలు సాయం సమయంలో ప్రశాంత వాతావరణంలో గిరిప్రదక్షిణ చేసి, తెల్లవారుజామున అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్‌లో చేరుకున్న తర్వాత రెండు గంటల్లో అమ్మవారి దర్శనం, ఇరుముడి, హోమ గుండంలో నేతి కొబ్బరి కాయ సమర్పణ, ప్రసాదాల కొనుగోలు పూర్తవుతోందని భవానీలు పేర్కొంటున్నారు.

తిరుగు ప్రయాణానికి అనువైన సమయం

ఉదయం ఆరు గంటల లోపే భవానీలు దీక్షలను పరిపూర్ణం చేసుకుని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌కు చేరుతున్నారు. విశాఖపట్నం వైపు రత్నాచల్‌, హైదరాబాద్‌ వైపు శాతవాహన, చెన్నయ్‌ వైపు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల లోపు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. నగరం నుంచి బయలుదేరే రైళ్లు, బస్సులను అందుకుని స్వస్థలాలకు చేరుకుంటున్నామని భవానీలు పేర్కొంటున్నారు. భవానీలతో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ కిటకిటలాడుతున్నాయి.

మూడో రోజు రూ.62.09 లక్షల ఆదాయం

దీక్షల విరమణ నేపథ్యంలో దేవస్థానానికి శనివారం రూ.62.09 లక్షల ఆదాయం సమకూరిందని దుర్గగుడి అధికారులు తెలిపారు. సింగిల్‌ లడ్డూల విక్రయాలతో రూ.26,355, ఆరు లడ్డూ బాక్స్‌ల విక్రయంతో రూ.57.49 లక్షలు, శ్రీచక్ర పెద్ద లడ్డూల విక్రయంతో రూ.1100, కేశఖండన టికెట్ల ద్వారా రూ.4.32 లక్షల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. 36,512 మందికి అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీ చేశామని వివరించారు.

నేడే కీలకం

దీక్ష విరమణలకు మరో రెండు రోజులే గడువు మిగిలి ఉంది. ఆదివారం భవానీల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది.

బందోబస్తు పరిశీలన

లబ్బీపేట(విజయవాడతూర్పు): భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తును ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియాతో కలిసి పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ షిరీన్‌బేగం, క్రైం ఏడీసీపీ ఎం. రాజారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

దీక్షల విరమణకు ఇరుముడులతో వచ్చిన భవానీలు దీక్షలు విరమిస్తున్న భవానీ భక్తులు

భవానీ.. శరణు శరణు 1
1/2

భవానీ.. శరణు శరణు

భవానీ.. శరణు శరణు 2
2/2

భవానీ.. శరణు శరణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement