అన్నదాతపై వివక్ష ఎందుకు?
అధికారులు రాకుంటే ఎలా?
ఆరోగ్య శ్రీలో డబ్బులు వసూళ్లు..
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశంలో జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ మాట్లాడుతూ పార్టీల పరంగా నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారని అలా కాకుండా రైతులకు పార్టీలను అంటకట్టకుండా నష్టం భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చైర్ పర్సన్ హారిక మాట్లాడుతూ మోంథా తుపాను ప్రభావం వల్ల రైతులకు చాలా మంది పంట చేతికొచ్చే సమయానికి నేలవాలిపోవటం, నీటితో నిండి పోవటం వంటి నష్టాలు జరిగాయని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారి పద్మావతి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము నష్టం అంచనాలను రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి నివేదించి రైతులకు నష్టం పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కో–ఆప్షన్ సభ్యుడు గౌసాని మాట్లాడుతూ తాము ఎంతో దూరం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలకు హాజరువుతుంటే సంబంధిత అధికారులు మాత్రం హాజరుకాకుండా కిందిస్థాయి సిబ్బంది పంపటం ఉపయోగం ఉండటం లేదన్నారు. దీనిపై సీఈవో కన్నమనాయుడు స్పందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క అధికారి సమావేశానికి హాజరుకావాలని, లేకుంటే వారే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి చర్చ జరిగిన సమయంలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కొంత మంది వైద్యులు పథకం ద్వారా కాకుండా విడిగా డబ్బులు వసూలు చేసి ఆపరేషన్లు చేస్తున్నారని దీని కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా డీఎంఅండ్హెచ్వో సుహాసిని స్పందిస్తూ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి పరిస్థితులు ఎదురైతే ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ 92810 68152 నంబర్ను సంప్రదించాలని ఆమె సభ్యులకు సూచించారు. సాంఘిక సంక్షేమ, సీ్త్ర శిశు సంక్షేమ, ఆర్థిక, పనుల స్థాయీ సంఘ సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమావేశాల్లో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు.


